ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత నెలలో ఇండియాకు సీమెన్స్ సీఈఓ..ఇంతలోనే న్యూయార్క్ ట్రిప్‌లో విషాదం

international |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 10:34 PM

న్యూయార్క్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ సీమెన్స్ సీఈఓ అగస్టన్‌ ఎస్కోబార్‌, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందారు. న్యూయార్క్‌ పర్యటనకు వచ్చిన ఆ కుటుంబం.. పర్యాటక హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురైంది. మన్‌హట్టన్ సమీపంలోని హడ్సన్‌ నది మీదుగా హెలికాప్టర్ వెళ్తోన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా గింగిరాలు తిరుగుతూ నదిలో కుప్పకూలి.. మంటలు చెలరేగడంతో అందులోని ఆరుగురు మృతి చెందారు. అగస్టన్ ఎస్కోబార్, ఆయన భార్య మెర్కా కాంపురుబి మోంటల్, వారి ముగ్గురు పిల్లలు (11 ఏళ్లు, 5 ఏళ్లు, 4 నాలుగేళ్లు)తో పాటు పైలట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.


కాగా, గత నెలలోనే ఎస్కోబార్ భారత్‌లో పర్యటించారు. బెంగళూరు, పుణే, ముంబయిలోని సీమెన్స్ హబ్‌కు వెళ్లి.. ఉద్యోగులను కలుసుకున్నారు. ‘ఇన్‌స్పైరింగ్ వీక్’ అంటూ ఈ పర్యటనపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ‘బెంగళూరు, పుణే, ముంబయిలోని ప్రతిభావంతులైన బృందాలను కలుసుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకం.. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబ్‌ల నుంచి తయారీ సౌకర్యాల వరకు ప్రతి కేంద్రంలోనూ నేను ఆవిష్కరణలను చూశాను’ అని లింక్డిన్‌లో పోస్ట్ పెట్టారు.


సీమెన్స్ బెంగుళూరు హబ్‌లో భవిష్యత్తు అవకాశాలపై లోతైన పరిశీలన, పుణేలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంజనీరింగ్, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందంలో ఆవిష్కరణలను అన్వేషించడం, ముంబయిలోని టీమ్‌తో అనుసంధానం కావడం సహా ముఖ్యమైన అంశాలను ఎస్కోబార్ ప్రధానంగా ప్రస్తావించారు.


తన పర్యటనలో సీమెన్స్ బృందాలను కలవడం చాలా సంతోషంగా ఉందని, అభిరుచి, శక్తి, శ్రేష్ఠత పట్ల వారి నిబద్ధత తనను ఎంతగానో ప్రేరేపించాయని తెలిపారు. ‘‘టౌన్ హాల్ సమావేశాల నుంచి చిన్న బృంద చర్చల వరకు.. ప్రతి సంభాషణ మన ప్రపంచ విజయగాథలో భారత్ ఎందుకు అంత కీలకమైన భాగంగా ఉందో నాకు ఈ పర్యటన చూపించింది’’ అని ఆయన అన్నారు.


తన పర్యటనను గుర్తుండిపోయేలా, అర్థవంతంగా చేసినందుకు సీమెన్స్ ఇండియా ఉద్యోగులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘సాంకేతికత ద్వారా రోజువారీ జీవితాన్ని మార్చేందుకు అంకితభావంతో మీరు చేస్తోన్న పని అద్భుతం’ అని కితాబిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa