ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత అర్ధరాత్రి వేళ వచ్చిన కొందరు వ్యక్తులు.. తలుపులు తెరవాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఆలయం తెరవడం కుదరదని, ఆగమశాస్త్రానికి విరుద్దమని పూజారి తెగేసి చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన గుంపు.. పూజారిపై దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని దేవాస్లో చోటుచేసుకుంది. ప్రముఖ ఆలయానికి చెందిన పూజారిని సుమారు 30 మంది వ్యక్తుల గుంపు తమను లోపలికి అనుమతించనందుకు దాడిచేసినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు.
ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మాతా టెక్రి ఆలయంలో జరిగిందని తెలిపారు. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. గతంలో నేర చరిత్ర ఉన్న జీతూ రఘువంశీ అనే వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి సుమారు 30 మందితో కలిసి ఎనిమిది నుంచి పది కార్ల కాన్వాయ్లో ఆలయానికి వచ్చాడని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కొండపై ఉన్న ఆలయం వద్దకు చేరుకున్న కాన్వాయ్లోని కొన్ని కార్లకు ఎర్రటి లైట్లు (బీకాన్లు) ఉన్నాయి. వారు తరువాత ఆలయం లోపల ప్రార్థనలు చేస్తున్నట్లు కనిపించారు.
‘‘మేము అర్ధరాత్రికి ఆలయ ద్వారాలు మూసివేస్తాం... జీతూ రఘువంశీ నేతృత్వంలోని గుంపు రాత్రి 12:40 గంటలకు వచ్చింది.. అప్పటికే నేను ద్వారాలు మూసివేశాను. ఆలయం మూసివేసినట్టు నేను వారికి చెప్పడంతో ద్వారాలు తెరవమని నన్ను బలవంతం చేశారు.. నన్ను చంపుతామని బెదిరించారు.. వారు నన్ను కొట్టారు’’ అని పూజారి ఎన్డీటీవీ తెలిపారు.
దేవాస్ సిటీ ఎస్పీ దినేష్ అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ..పూజారి ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని సుమారు 50 కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. అయితే, బీజేపీ నేత కుమారుడు ఈ గుంపునకు నాయకత్వం వహించి, వారిని వెంటేసుకొచ్చాడా? అని మీడియా ప్రశ్నించగా.. కేసు దర్యాప్తులో ఉందని అగర్వాల్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa