ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏమిటా మాటలు..: అలహాబాద్ హైకోర్టుపై సుప్రీం ఆగ్రహం

national |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 09:06 PM

స్త్రీల వక్షోజాలను పట్టుకోవడం, ప్యాంటు నాడాలు విప్పడం వంటివి చేస్తే అత్యాచారయత్నం కిందకు రాదంటూ ఇటీవలే అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పునిచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకే మళ్లీ ఆదే న్యాయస్థానానికి చెందిన మరో జడ్జి.. అత్యాచార బాధితురాలే సమస్యను కొని తెచ్చుకుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ రెండు కేసుల్లోనూ నిందితులకు న్యాయమూర్తులు బెయిల్ మంజూరు చేయడంపై తాజాగా సుప్రీం కోర్టు స్పందించింది. అసలు అలహాబాద్ హైకోర్టులో ఏం జరుగుతుందని ప్రశ్నించింది. అసలు ఇలాంటి కేసుల్లో బాధితుల గురించి.. ఎలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


మార్చి 17వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఓ అత్యాచార కేసులో తీర్పునిస్తూ షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా.. స్త్రీల వక్షోజాలు పట్టి లాగడం, ప్యాంటు నాడాలు విప్పడం వంటి చర్యలు అత్యాచారయత్నం కిందకు రావని వివరించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ కూడా మంజూరు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ప్రజలు సైతం దీని గురించి హైకోర్టును ప్రశ్నించగా.. సుప్రీం కోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళ వారం రోజు విచారణ జరపుతూనే అలహాబాద్ ఇటీవలే ఇచ్చిన మరో తీర్పుపై స్పందించింది.


ముఖ్యంగా ఏప్రిల్ 10వ తేదీన ఓ అత్యాచార కేసుపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు.. బాధితురాలే రేప్ జరగడానికి కారణం అని చెప్పింది. జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఈ కేసులో తీర్పునిస్తూ.. బాధితురాలు తనంతట తానే సమస్యను ఆహ్వానించిందని.. ఆమె ఓ పీజీ విద్యార్థి కాగా ఆమె చేసే చర్యలపై ఆమెకు పూర్తి అవగాహనం ఉందంని వెల్లడించారు. ఈక్రమంలోనే నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే సుప్రీం ఫైర్ అయింది. బాధితురాలే సమస్యను కొని తెచ్చుకుందని చెప్పడం ఏంటంటూ ప్రశ్నించింది.


ఇలాంటి విషయాల గురించి మాట్లాడే సమయంలో న్యాయమూర్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని జస్టిస్ మసీహ్‌తో కూడిన బెంచ్‌కు నాయకత్వం వహిస్తున్న జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగేలా చూడాలని.. ఈ వ్యాఖ్యల నుంచి సామాన్యులు ఏం గ్రహిస్తారని ప్రశ్నించారు. గత కేసుకు ఈ కేసును జోడించి.. పార్టీల మధ్య వాదనలు అసంపూర్ణగా ఉన్నాయని పేర్కొంటూ కేసును వాయిదా వేశారు. మరోవైపు సుమోటో కేసులో సుప్రీం కోర్టుకు సాయం చేస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఇలాంటి తీర్పులు విన్న ప్రజలు దీన్నుంచి ఏం నేర్చుకుంటారు, ఏం గ్రహిస్తారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa