రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లపై నెట్టింట మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి. హోం గ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వరుసగా మూడో మ్యాచ్ ఓడిపోయింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఒకానొక దశలో లోయెస్ట్ స్కోర్కి ఆలౌట్ అవుతారేమోనన్న భయం ఆ టీమ్ను వెంటాడింది. అయితే ఆర్సీబీ బ్యాటర్లపై టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన స్టయిల్లో ఇచ్చి పడేశాడు.
"ఆర్సీబీ చెత్త బ్యాటింగ్ ఆడింది. బ్యాటర్లంతా నిర్లక్ష్యపు షాట్స్తోనే అవుటయ్యారు. ఒక్కడంటే ఒక్క బ్యాటర్ కూడా మంచి బంతికి అవుట్ కాలేదు. కనీసం వాళ్లు కామన్సెన్స్ అన్న ఉపయోగించలేకపోయారు. ఒకవేళ చేతిలో వికెట్లు ఉండుంటే 110 నుంచి 120 పరుగులు ఈ 14 ఓవర్లలో రాబట్టేవారు. ఆ స్కోర్ చేసుంటే వాళ్లు కనీసం పోటీ అయినా ఇచ్చుండేవాళ్లు" అని వీరేంద్ర సెహ్వాగ్ క్రికెబజ్ చాట్లో అన్నాడు.
అర్షదీప్ సింగ్, మార్కో యాన్సన్, యుజ్వేంద్ర చాహల్, హర్ప్రీత్ బ్రార్ అందరూ ఈ మ్యాచ్లో వికెట్లు దక్కించుకున్నారు. అయితే సెహ్వాగ్ పంజాబ్ బౌలర్లకు ఆ క్రెడిట్ ఇవ్వాలని అనుకోవడం లేదంటా.. ఈ వికెట్లన్నీ ఆర్సీబీ బ్యాటర్లే చేజేతులారా పోగొట్టుకున్నారని చెప్పాడు.
హోం గ్రౌండ్లో ఆర్సీబీ బ్యాటర్లు ఇలాంటి ప్రదర్శన ఇస్తున్నప్పుడు కెప్టెన్ రజత్ పటిదార్ వాళ్లని దారిలో పెట్టే ప్రయత్నం చేయాలని సెహ్వాగ్ సూచించాడు. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రజత్ పటిదార్ తనవంతు ప్రయత్నం తాను చేసినప్పటికీ, తోటి ఆటగాళ్లతో ఆడించలేకపోయాడు.
"కెప్టెన్ రజత్ పటిదార్ ఓ పరిష్కారాన్ని చూడాలి. హోం గ్రౌండ్లో వాళ్లు గెలవలేకపోతున్నారు. ఆర్సీబీ బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు.. కానీ బ్యాటర్లు మాత్రం విఫలమవుతూనే ఉన్నారు. ఆర్సీబీ బ్యాటర్లు హోం గ్రౌండ్లో విఫలమవడం మంచి పరిణామం కాదు. మరి దీన్ని ఎవరు పరిష్కరిస్తారో?" అని సెహ్వాగ్ అన్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ఏడు మ్యాచ్లు ఆడి మూడింటిలో ఓడింది. నాలుగు మ్యాచ్లలో గెలిచిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆర్సీబీ ఓడిన మూడు మ్యాచ్లు కూడా హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలోనే కావడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa