ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లా ఆసుపత్రిలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ మహిళ మృతదేహం నుంచి వార్డ్ బాయ్ బంగారు చెవి కమ్మలను అపహరించాడు. సీసీటీవీ కెమెరాలో ఈ దారుణ దృశ్యాలు రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్లోని హిరన్ వాడ గ్రామానికి చెందిన సచిన్ కుమార్ భార్య శ్వేత (26) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆమెను షామ్లీలోని జిల్లా సంయుక్త ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శ్వేత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల రాక కోసం మృతదేహాన్ని ఆసుపత్రి వార్డులో ఉంచారు.ఈ సమయంలోనే ఆసుపత్రిలో వార్డ్ బాయ్గా పనిచేస్తున్న విజయ్ తన దుర్బుద్ధిని ప్రదర్శించాడు. వార్డులో ఉన్న శ్వేత మృతదేహం వద్దకు వెళ్లి, ఎవరికీ అనుమానం రాకుండా ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను చాకచక్యంగా తీశాడు. కొంత సమయం తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ క్రమంలో విజయ్, తాను నేలపై కనుగొన్నానంటూ ఒక చెవి కమ్మను పోలీసులకు అప్పగించాడు.అయితే, విజయ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అందులో విజయ్, శ్వేత మృతదేహం చెవుల నుంచి కమ్మలను తీస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, అప్పటికే విజయ్ ఆసుపత్రి నుంచి పరారయ్యాడు.మృతురాలి భర్త సచిన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు విజయ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో, నిందితుడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa