టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు ప్రైవేట్ బస్సు యాజమాన్యాల తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ప్రైవేట్ బస్సు యజమానులు నిర్వహించిన సమావేశాన్ని ప్రస్తావిస్తూ, తనను ఆ సమావేశానికి పిలవకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమావేశానికి ఆహ్వానించకపోయినా తనకు ఎలాంటి నష్టమూ లేదని అన్నారు. ఈ మీటింగ్ పెట్టిన బస్సు ఓనర్లకు ఎవరికీ సరైన అవగాహన లేదని విమర్శించారు.బస్సులను ఎలా నడపాలో తనకు బాగా తెలుసని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, ప్రైవేట్ బస్సు యజమానుల్లో కొందరు చేతకాని వాళ్ళు ఉన్నారని, వారి అసమర్థత కారణంగానే ప్రైవేట్ బస్సు రవాణా రంగం నష్టాలను చవిచూస్తోందని ఆయన ఆరోపించారు. అటువంటి వారే తమ బస్సులను లీజుకు ఇస్తున్నారని విమర్శించారు.బస్సులను లీజుకు ఇచ్చే విధానాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు జేసీ స్పష్టం చేశారు. ముఖ్యంగా, లీజుకు తీసుకున్న బస్సులను అనంతపురం జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగనివ్వబోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. "లీజుకు ఇచ్చిన బండ్లు అనంతపురం జిల్లాలో తిరగడానికి వీల్లేదు. ఎలా తిప్పుతారో చూస్తాం. సొంత బస్సులైతేనే తిరగాలి" అంటూ స్పష్టం చేశారు.హైదరాబాద్లో సమావేశమైన బస్సు యజమానుల సంఘం, ముందుగా బస్సులను లీజుకు ఇవ్వకూడదనే అంశంపై స్పష్టమైన తీర్మానం చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఇతర విషయాల గురించి మాట్లాడాలని సూచించారు. బస్సు అసోసియేషన్లో ఎవరున్నా సరే, లీజు పద్ధతిని మాత్రం అనుమతించకూడదని ఆయన గట్టిగా చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa