ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెయిట్ లాస్ సీక్రెట్ రివీల్ చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా

national |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 08:40 PM

కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తన ఆరోగ్యం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన వెయిట్ లాస్ జర్నీ వెనుక రహస్యాన్ని బయటపెట్టారు. తగినంత నిద్ర, మంచి ఆహారం, నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానని ఆయన తెలిపారు. దీనివల్ల జీవితంలో చాలా సాధించానని, నాలుగున్నరేళ్లలో అల్లోపతి మందులను పూర్తిగా మానేశానని అమిత్ షా చెప్పుకొచ్చారు. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్బీఎస్)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.


యువత రోజుకు రెండు గంటల వ్యాయామం, ఆరు గంటల నిద్రతో మంచి ఆరోగ్యం పొందవచ్చని అమిత్ షా అన్నారు. ఇలా చేయడం వల్ల తన పనితీరు, ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు. ‘వీటివల్ల జీవితంలో తానెంతో సాధించానని, నాలుగున్నరేళ్లలో అల్లోపతి మందులను పూర్తిగా వేసుకోవడం మానేశాను’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ఉజ్వల యోజన, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలు ప్రజల ఆరోగ్యం కోసం ఉద్దేశించినవని అమిత్ షా వివరించారు. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాటు వంటి పథకాలు కూడా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు.


‘‘మే 2019 నుంచి ఇప్పటివరకు నా ఆరోగ్యం విషయంలో ఎంతో పెద్ద మార్పు సాధించాను. సరైన నిద్ర, స్వచ్ఛమైన నీరు, ఆహారం, నిత్య వ్యాయామంతో జీవితం బాగా మారింది. గత నాలుగున్నరేళ్లలో నేను అన్ని అలోపతి మందుల నుంచి విముక్తి పొందాను’’ అని పేర్కొన్నారు. ఇది తన పని సామర్థ్యం, ఆలోచనా ధోరణి, నిర్ణయాల తీసుకునే శక్తిని మెరుగుపరచిందని షా వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ లివర్ రిహాబిలిటేషన్ సెంటర్‌తో పాటు కాలేయ ఆరోగ్యంపై వేసిన కార్టూన్ల పుస్తకాన్ని అమిత్ షా ప్రారంభించారు. తనను ఉద్దేశించిన కార్టూన్లతో సహా అన్ని వ్యంగ్య చిత్రాలను తాను ఆస్వాదిస్తానని ఆయన చెప్పారు.


ప్రభుత్వం ఆరోగ్య రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిందని ఆయన తెలిపారు. ‘సమగ్ర ఆరోగ్యరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని’ కేంద్ర హోం మంత్రి అన్నారు. అలాగే, వ్యాయామం, నిద్ర ప్రాముఖ్యతను ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. కార్పొరేట్ సంస్థలు కూడా లివర్ ఆరోగ్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలను నిర్వహించాలని, దాని చికిత్స, పరిశోధనలపై చేస్తున్న సంస్థలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ బడ్జెట్ 2014లో రూ. 37,000 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు అది రూ. 1.27 లక్షల కోట్లకు పెరిగిందని అమిత్ షా వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa