ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ భూములు, అమరావతి పనులపై ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టిన మాజీ సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 22, 2025, 03:32 PM

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ  సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయని, వ్యవస్థలను దిగజార్చుతున్నారని ఆరోపించారు.ప్రభుత్వ నిర్ణయాలలో పారదర్శకత లోపించిందని జగన్ విమర్శించారు. విశాఖపట్నంలో సుమారు రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని ఎలాంటి గుర్తింపు లేని సంస్థకు కేవలం ఒక్క రూపాయికే కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా, లులూ గ్రూపునకు రూ.2,000 కోట్ల విలువైన భూమిని అప్పగించారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల అంచనాలను భారీగా పెంచి, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని అన్నారు. గతంలో రూ. 36 వేల కోట్లుగా ఉన్న పనుల అంచనాలను, సిమెంట్, స్టీల్ ధరలు పెరిగాయనే సాకుతో ఇప్పుడు రూ. 77 వేల కోట్లకు పెంచారని జగన్ ఆరోపించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వంటి పారదర్శక విధానాలను తొలగించి, మొబిలైజేషన్ అడ్వాన్సులను తిరిగి తీసుకురావడం ద్వారా దోపిడీకి ఆస్కారం కల్పిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, తమ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టును ఆయన ఖండించారు. ఇది కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ఠ అని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని, లేనిపోని ఆరోపణలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి అరెస్టులు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మద్యం విధానం విప్లవాత్మకమైనదని అన్నారు.గత ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని దుయ్యబట్టారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా పక్కనపెట్టారని, రూ. 3500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాల కింద గత ఏడాది రూ. 3,900 కోట్లు బకాయి పెట్టారని, ఈ ఏడాది కూడా చెల్లింపులు జరగడం లేదని తెలిపారు. పెన్షన్ల సంఖ్యను తగ్గించారని, కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.తాము గతంలో సంక్షేమ పథకాలకు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయడానికి బటన్ నొక్కామని, ఇప్పుడెందుకు అలా చేయడం లేదని జగన్ ప్రశ్నించారు. బటన్ నొక్కితే డబ్బులు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళతాయని, మధ్యలో దోచుకోవడానికి ఏమీ ఉండదనే ఉద్దేశంతోనే చంద్రబాబు బటన్ నొక్కడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుండగా, ప్రభుత్వ పెద్దల జేబులు నిండుతున్నాయని ఆరోపించారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పీఏసీ సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలని జగన్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, ప్రభుత్వ వైఫల్యాలను, అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వైసీపీకి మీడియా బలం తక్కువగా ఉన్నందున సోషల్ మీడియాను, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ను ఒక ఆయుధంగా వాడుకోవాలనే విషయంపై కార్యకర్తలకు అవగాహన కల్పించాలన్నారు. గతంలో కాంగ్రెస్‌ను వీడినప్పుడు కూడా ఇలాంటి దుష్ప్రచారాలు ఎదుర్కొన్నామని, అయినా ప్రజలు ఆశీర్వదించారని గుర్తుచేశారు. ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరని, ప్రజల అంతిమ తీర్పును ఎవరూ మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు. కష్టకాలంలోనే నాయకులు ఎదుగుతారని, ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa