ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్న అసోం ప్రొఫెసర్

national |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 06:09 AM

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి తాను, తన కుటుంబం ఎలా ప్రాణాలతో బయటపడ్డారో అసోంకు చెందిన ఓ ప్రొఫెసర్ వివరించారు. ఆ భయానక సమయంలో అందరితో పాటు తాను కూడా ఇస్లామిక్ ప్రార్థన అయిన 'కలిమా'  చదవడం వల్లే ఉగ్రవాది తనను వదిలిపెట్టి ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డారు. అసోంలోని సిల్చార్‌లో గల అసోం యూనివర్సిటీలో బెంగాలీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దేబశిష్ భట్టాచార్య, ఆ దాడి సమయంలో తన కళ్లెదుటే జరిగిన కాల్పుల ఘటనను, తృటిలో తప్పించుకున్న వైనాన్ని బుధవారం ఓ జాతీయ మీడియాతో పంచుకున్నారు.కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం జమ్ముకశ్మీర్ వెళ్లామని, మంగళవారం పహల్గాం సమీపంలోని బైసరన్ వద్ద ప్రకృతిని ఆస్వాదిస్తున్నామని భట్టాచార్య తెలిపారు. ఆ సమయంలో అక్కడ వందలాది పర్యాటకులు ఉన్నారని, హఠాత్తుగా తుపాకీ పేలిన శబ్దం వినిపించిందని అన్నారు. మొదట అటవీ శాఖ సిబ్బంది వన్యప్రాణులను భయపెట్టడానికి కాల్పులు జరిపి ఉంటారని భావించామని ఆయన చెప్పారు."నా కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా, ఓ వ్యక్తి తుపాకీతో మా దగ్గరకు రావడం గమనించాను. అతను అటవీ శాఖ అధికారి అనుకున్నాను. నల్లటి మాస్క్, నల్లటి టోపీ ధరించి ఉన్నాడు. అతను ఓ జంటతో మాట్లాడి, వెంటనే భర్తను కాల్చి చంపాడు. మేము, మరికొందరు వెంటనే పరుగెత్తి ఓ చెట్టు కింద దాక్కున్నాం. ఆ ఉగ్రవాది మా సమీపంలోకి వచ్చి, మాకు అతి సమీపంలో నేలపై పడుకోవడానికి ప్రయత్నిస్తున్న మరో వ్యక్తిని కాల్చేశాడు" అని భట్టాచార్య ఆ భయానక దృశ్యాన్ని వివరించారు.ఆ సమయంలో తీవ్ర భయాందోళన నెలకొందని, తన చుట్టూ ఉన్నవారంతా 'కలిమా' చదువుతున్నారని, తాను కూడా వారితో గొంతు కలిపానని ప్రొఫెసర్ తెలిపారు."నా చుట్టూ ఉన్న వారందరూ కలిమా  పఠిస్తున్నారు, నేను కూడా అదే చేశాను. ఉగ్రవాది నా తలకు తుపాకీ గురిపెట్టాడు. నేను చదువుతున్నది విని, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అందరూ 'లా ఇలాహీ అని చదువుతుంటే నేను కూడా అదే అన్నాను. అది నా ప్రాణాలు కాపాడుతుందని నాకు తెలియదు. కానీ అతను విని వెళ్లిపోయాడు" అని భట్టాచార్య చెప్పారు. ఆ ప్రాంతంలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు వేర్వేరు దిశల్లో కాల్పులు జరుపుతూ కనిపించారని ఆయన పేర్కొన్నారు.తమ వద్దకు వచ్చిన ఉగ్రవాది వెళ్లిపోయిన తర్వాత, తాము ఏడడుగుల కంచె దూకి, అక్కడి నుంచి పరుగెత్తామని భట్టాచార్య తెలిపారు. దారిలో ఓ స్థానిక కుటుంబాన్ని కలిశామని, వారు బయటకు వెళ్లే మార్గం చూపించారని అన్నారు. తమ గైడ్ కూడా వెతుక్కుంటూ వచ్చి తమను కలుసుకున్నాడని, అనంతరం డ్రైవర్ తమను శ్రీనగర్‌కు సురక్షితంగా చేర్చాడని ఆయన వివరించారు.ప్రస్తుతం తాను, తన కుటుంబం జమ్ముకశ్మీర్ నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని, అసోం ముఖ్యమంత్రి కార్యాలయం కూడా తమతో సంప్రదింపులు జరుపుతూ సహాయం అందిస్తోందని ప్రొఫెసర్ భట్టాచార్య తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa