ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్‌ కలిశారు.

national |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 07:56 PM

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్‌ కలిశారు. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చర్యల నేపథ్యంలో రాష్ట్రపతితో భేటీ అయిన కేంద్ర మంత్రులు దేశభద్రత, పాక్ దౌత్యపరమైన చర్యలపై కీలక చర్చలు జరిపారు.జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణ ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలను తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లోకి నెట్టింది. ఈ దాడిలో 26 మంది అమాయక భారతీయులను ఉగ్రవాదులు బలిగొన్న ఘటనపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్థాన్‌తో కీలకమైన సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన కేంద్రం, పాకిస్థాన్ జాతీయులకు అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు గురువారం వెల్లడించింది.భారత్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలకు పాకిస్థాన్ కూడా ప్రతిచర్యలకు దిగింది. భారత విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఇరు దేశాలు తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో సరిహద్దుల్లోనూ, దౌత్యపరంగానూ ఆందోళనకర వాతావరణం నెలకొంది.ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన, అనంతర పరిణామాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి రాష్ట్రపతికి వివరించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన చిత్రాన్ని రాష్ట్రపతి భవన్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు.మరోవైపు, పహల్గాం ఉగ్రదాడి ఘటనపై అంతర్జాతీయ సమాజానికి వివరించే ప్రయత్నాల్లో భాగంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. చైనా, కెనడా సహా పలు జీ20 దేశాలకు చెందిన రాయబారులతో విదేశాంగ శాఖ అధికారులు సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో ఉగ్రదాడికి సంబంధించిన వివరాలు, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి వివరించినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa