ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ.. ఆర్మీ వాహనాన్ని పేల్చేసిన బలూచిస్థాన్ ఆర్మీ దాడి

international |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 10:31 PM

పాకిస్థాన్ ఆర్మీకి బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ గట్టి దెబ్బ కొట్టింది. శుక్రవారం (ఏప్రిల్ 25) క్వెట్టా నగరంలో పాక్ సైనిక వాహనాలపై దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది పాక్ సైనికులు మరణించారు. పాకిస్థాన్ ఆర్మీ వాహనాన్ని పేలుడు పదార్థాలను ఉపయోగించి పేల్చివేశారు. క్వెట్టాలోని మార్గట్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి వార్తతో పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. BLA వరుస దాడులతో పాకిస్థాన్‌లో ఆందోళన నెలకొంది.


క్వెట్టాలో తాము జరిపిన దాడిలో పాక్ ఆర్మీకి చెందిన పది మంది సైనికులు చనిపోయారని BLA ప్రకటించింది. పాక్ ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకొని రిమోట్ కంట్రోల్ ద్వారా పేలుడు పదార్థాలను పేల్చి ఈ దాడికి పాల్పడింది. పేలుడు దాటికి సైనిక వాహనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న జవాన్లందరూ మరణించినట్లు పాక్ మీడియాలో కథనాలు ప్రచురించారు.


బలూచిస్థాన్‌ స్వాతంత్య్రం కోసం BLA పోరాడుతోంది. కొంత కాలంగా దాడులు చేస్తోంది. గత నెలలో బోలాన్ ప్రాంతంలో బీఎల్‌ఏ సభ్యులు ‘జాఫర్’ రైలును హైజాగ్ చేశారు. రైల్లో ప్రయాణిస్తున్న పాక్ జవాన్లను బందీలుగా చేసుకున్నారు. 90 మంది పాక్ సైనికులను హతమార్చామని ఆ తర్వాత ప్రకటించారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.


భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని చేస్తామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరించింది. ‘శత్రు సైన్యంపై మా పోరాటం కొనసాగుతుంది. బలూచిస్థాన్ ప్రజలను పాకిస్థాన్ ప్రభుత్వం అణచివేస్తోంది. అందుకే మేము వారి స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం’ అని బీఎల్ఏ  ఒక ప్రకటన విడుదల చేసింది.


మూడు వైపులా చిక్కులు.. పాక్ సైన్యం ఉక్కిరిబిక్కిరి


జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాగ్ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, బీఎల్ఏపై చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. కానీ, పాకిస్థాన్ సైన్యం చర్యలు ఫలితం లేకుండాపోయాయి. బీఎల్‌ఏ ముందు పాక్ సైన్యం నిస్సహాయంగా కనిపిస్తోంది. ఇదిలాఉండగా.. భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండటం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ చర్యలకు ప్రతిగా స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ సైన్యాన్ని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత LoC వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్, భారత్ సైన్యాలు ఎదురెదురుగా నిలిచాయి. పాక్ సైన్యం కవ్వింపులకు భారత జవాన్లు దీటుగా బదులిస్తున్నారు. అటు అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దులోనూ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇలాంటి సమయంలో బలూచిస్థాన్ ఆర్మీ దాడులు పాకిస్థాన్ సైన్యాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa