ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింధు నదిలో మా నీళ్లైనా పారాలి.. భారతీయుల రక్తమైనా పారాలి

international |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 10:30 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులే కాగా.. ఆ దేశం మాత్రం తమకు ఏ సంబంధం లేదని చెబుతోంది. కానీ పాక్ మంత్రులు మాట్లాడే మాటలు చూస్తుంటే మాత్రంఈ దాడి వెనుక ఉన్నది వాళ్లేనని అర్థం అవుతోంది. ఈక్రమంలోనే భారత్ ఆ దేశంపై పగ తీర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయితే తాజాగా దీనిపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావర్ భుట్లో జర్దారి స్పందించారు. భారత్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా సింధు నదిలో పాకిస్థాన్ నీళ్లైనా పారాలని లేదా భారతీయుల రక్తమైనా పారాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


సింధు నదిపై కొత్తగా కెనాల్స్ నిర్మించే అంశం గురించి ఇటీవలే పాకిస్థాన్ ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగానే ఆ దేశంలోని రాష్ట్రాలన్నింటి మధ్య పరస్పర అంగీకారం లేకుండా కెనాల్స్ నిర్మించరాదన్న అభిప్రాయాన్ని అక్కడి స్థానిక ప్రభుత్వాలు తెలిపాయి. ఈక్రమంలోనే సుకుర్‌లో జరిగిన బహిరంగ సభలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి ప్రసంగించారు. ఈ అంశంపై పీపీపీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ మధ్య ఒప్పందాలు కూడా కుదిరినట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల ఆమోదం లేకుండా సింధు నదిపై కొత్తగా కాలువలు నిర్మించరాదని పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు.


అలాగే సింధు నదిపై మరోసారి దాడి జరుగుతుందని బిలావల్ ఆరోపించారు. ఈసారి భారత్ ఆ ప్రయత్నానికి ఒడిగట్టిందన్నారు. ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసిందన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అంశంలో పాకిస్థాన్‌ను తప్పుగా ఆరోపిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని తమ దేశమే తీవ్రంగా ఖండిస్తుందంటూ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్థాన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు. దాంట్లో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారన్నారు.


ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి తాము గట్టిగా బదులు ఇస్తామని వెల్లడించారు. ఇండియా తన నిర్ణయాన్ని ఏక పక్షంగా తీసుకున్నట్లు బిలావల్ చెప్పుకొచ్చారు. సింధు జలాలు మావే అంటూనే.. అవెప్పటికీ మావే అంటూ పునరుద్ఘాంటించారు. అంతేకాకుండా సింధు నదిలో తమ నీళ్లైనా పారాలని లేదా భారతీయుల రక్తమైనా పారాలంటూ బిలావర్ వ్యాఖ్యానించారు. క్లిష్ట పరిస్థితుల్లో నదిని రక్షించుకునేందుకు ఇండియాపై పోరాటం కొనసాగిస్తామన్నారు. భారత్ తమ ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు తమ పోరాటన్ని ఆపమని వివవరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa