ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సింధూ జలాలు ఆపితే మీ శ్వాస ఆపేస్తాం"..లష్కరే తోయిబా చీఫ్ వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 11:39 PM

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రమూకలు చేసిన దాడికి ప్రతీకారంగా భారత్.. పాక్‌పై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఇప్పటికే నీటి కటకటతో అల్లాడిపోతున్న పాకిస్తాన్.. ఎడారిలా మారే పరిస్థితులు రానున్నాయి. ఈ క్రమంలోనే సింధూ నదీ జలాల విషయంలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ చీఫ్, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో భారత్‌ను, ప్రధానంగా నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన హెచ్చరికలు ఉన్నాయి.


సింధు నది జలాల ఒప్పందం రద్దు గురించి హఫీజ్ సయీద్ అనే ఉగ్రవాది మాట్లాడిన వీడియోను ప్రస్తుతం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కావాలనే వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా.. ప్రస్తుతం పాక్‌కు భారత్ నిలిపేసిన సింధు నది జలాల విషయంలో పాక్ ప్రజలను రెచ్చగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక వైరల్ అవుతున్న వీడియోలో భారత ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని.. హఫీజ్ సయీద్ బెదిరించే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. ఆ వీడియోలో ప్రధాని మోదీని బెదిరిస్తూ.. ‘‘మీరు పాకిస్తాన్‌కు నీళ్లు ఆపేస్తే.. మేము మీ శ్వాసను ఆపేస్తాము. నదుల్లో రక్తం ప్రవహిస్తుంది’’ అని హఫీజ్ సయీద్ ఆ వీడియోలో తీవ్ర హెచ్చరికలు చేయడం గమనార్హం.


పహల్గామ్ ఉగ్రదాడి.. దానికి బదులుగా భారత్ తీసుకున్న నిర్ణయాల వేళ ఈ వీడియో వైరల్ అవుతోంది. సింధూ నదీ జలాల విషయంలో భారత్-పాక్ మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు గురువారం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో హఫీజ్ సయీద్ మాట్లాడిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో గురించి భారత ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. అది పాత వీడియో అని కొట్టిపారేశాయి.


జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ టీఆర్ఎఫ్ ఈ ఉగ్రదాడిలో అమాయక టూరిస్టులు 26 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa