ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం.. మే ఒకటి నుంచి అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 08:20 PM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావటంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతోంది. వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలను పరిమితం చేసింది. మే ఒకటో తేదీ నుంచి జులై 15 వరకూ ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే మే ఒకటో తేదీ నుంచి తిరుమలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు ఉదయం 6 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు.


మరోవైపు తిరుమల శ్రీవారి భారీ విరాళం అందింది. ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు విరాళంగా అందింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు విరాళంగా అందించింది. ఆదివారం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు విరాళం తాలూకు చెక్కును అందించారు. మరోవైపు చెన్నైకు చెందిన కంపెనీ కూడా ఆదివారం టీటీడీకి భారీ విరాళం అందించింది. చెన్నైకు చెందిన పొన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆదివారం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించింది. టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరికి విరాళం తాలుకు చెక్కును కంపెనీ ఎండీ అందజేశారు.


మరోవైపు ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో సీతా జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. మే ఆరో తేదీన సీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతా జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలపనున్నారు. అనంతరం పరివార దేవతలకు తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఆల‌యంలోని రంగ మండ‌పంలోకి శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను వేంచేస్తారు. ప్రత్యేకంగా సీతమ్మకు “వాసంతిక పూజ” మ‌ల్లె పూల‌తో సహస్రనామార్చన నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa