సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత.. ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేని పరిస్థితి. కొన్ని వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఒక్కోసారి నిజాన్ని కూడా నమ్మలేని పరిస్థితి . మరోసారి అబద్ధమే నిజమని భ్రమపడే దుస్థితి. ఇలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. తాజాగా ఓ వార్త, వీడియో కూడా అలాగే నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో ప్రతీ ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ బంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయని వైరల్ అవుతోంది.
ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు సెలవు.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించడం కోసం ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించారు. మే నెల 14వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనీ పెట్రోల బంకుల యజమానులు సంఘం తెలియజేసింది.పెట్రోలియం వాడకం తగ్గించడం ద్వారా ఇంధన వనరుల పరిరక్షణ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే వైరల్ అవుతున్న వార్త, వీడియో పాతదిగా తెలిసింది. 2017 నాటి వీడియోగా తెలిసింది. అయితే ఈ వీడియోను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం కానీ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక సమాచారమేదీ లేదు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ అంటూ వైరల్ అవుతున్న వార్త అబద్ధమని తెలిసింది. పాత వీడియోను, సమాచారాన్ని ప్రస్తుతం జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఇలాంటి వైరల్ పోస్టులను నమ్మి, షేర్ చేయవద్దని అధికారులు సలహా ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విషయాలను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవటం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa