ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ యుద్ధ సన్నాహాలు.. యాంటీ-మిసైల్ టెస్ట్‌

national |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 09:23 PM

పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ క్రమంలో భారత నౌకాదళం యాంటీ-షిప్ మిసైల్ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. యుద్ధ సన్నద్ధతలో భాగంగా అరేబియా సముద్రంలో యుద్ధ నౌకల నుంచి సుదీర్ఘ దూరాన లక్ష్యాలను ఖచ్చితంగా చేధించిది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు భారత నౌకాదళం యుద్ధానికి సిద్ధంగా ఉందని నేవీ స్పష్టం చేసింది. అరేబియా సముద్రం మధ్యలో యుద్ధనౌకల నుంచి చేపట్టిన బ్రహ్మోస్ యాంటీ-షిప్, యాంటీ-సర్ఫేస్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగాలకు సంబంధించిన దృశ్యాలను భారత నౌకాదళం పంచుకుంది. ఈ ప్రయోగాలలో కోల్‌కతా శ్రేణి విధ్వంసక నౌకలు, నీలగిరి, క్రివాక్ శ్రేణి ఫ్రిగేట్లు పాల్గొన్నాయి. అటు, కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం సైన్యం ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తోంది.


ఎక్స్ (ట్విట్టర్)లో వీడియోలను పోస్ట్ చేసిన నేవీ.. ‘భారత నౌకాదళానికి చెందిన నౌకలు, వ్యవస్థలు, సిబ్బంది ఖచ్చితమైన దీర్ఘశ్రేణి దాడుల కోసం సన్నద్ధతను పునరుద్ఘాటించేందుకు, ప్రదర్శించేందుకు విజయవంతంగా అనేక నౌక విధ్వంసక క్షిపణి ప్రయోగాలను నిర్వహించాయి. భారత నౌకాదళం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా దేశ ప్రయోజనాలను కాపాడేందుకు సిద్ధంగా ఉంది’ అని తెలిపింది. అరేబియా సముద్రంలో జరిగిన ఈ ప్రయోగాలపై పాకిస్థాన్ సైతం నోటిఫికేషన్ జారీ చేసింది.


భారత్-పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల వేళ ఈ ప్రయోగాలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్తు దేశం రగిలిపోతోంది. దీనికి వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందని బలంగా నమ్ముతోన్న భారత్.. దాయాదిపై దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ జాతీయులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించింది. అదేసమయంలో కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని కూడా భారత్ సస్పెండ్ చేసింది.


అటు, పాక్ సైతం భారత్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసింది. అదే సమయంలో, నియంత్రణ రేఖ (LOC) వద్ద పాక్ కవ్వింపులకు పాల్పడుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి పలు సార్లు కాల్పుల ఉల్లంఘన ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటికి భారత సైన్యం సమర్థంగా ప్రతిస్పందించిందని పేర్కొంది. అయితే, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.


అటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఉగ్రవాదులను ఎక్కడున్నా వదిలిపెట్టబోమని, వారిని భూమి చివరిమేర వరకూ వెంబడించి శిక్షిస్తామని పహల్గామ్ ఘటన తర్వాత బిహార్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. తాజాగా, మరోసారి మన్2 కీ బాత్‌లోనూ ఇదే విషయం స్పష్టం చేశారు. ఉగ్రదాడి తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని, బాధితుల కుటుంబాల బాధను ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని చెప్పారు. ‘కశ్మీర్‌లో మళ్లీ శాంతి ఏర్పడుతోంది. కానీ దేశానికి, జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధిని శత్రువులు భరించలేకపోయారు,అని ఆయన అన్నారు. బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మోదీ పునరుద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa