ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను మాట ఇస్తున్నా.. న్యాయం జరుగుతుంది.. ప్రధాని

national |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 09:21 PM

జమ్మూ కశ్మీర్‌లో గతవారం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పందించారు. ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో దేశాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ దాడి ఉగ్రవాదుల అసహనానికి, పిరికితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘కశ్మీర్‌లో మళ్లీ శాంతి నెలకుంటోంది.. పాఠశాలలు, కళాశాలలు ఉల్లాసంగా ఉన్నాయి, గతంలో ఎన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి పనులు జరిగాయి, ప్రజాస్వామ్యం బలపడుతోంది, పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది, ఆదాయాలు పెరుగుతున్నాయి, యువతకు కొత్త అవకాశాలు వచ్చాయి. ఈ అభివృద్దిని దేశం, జమ్మూ కశ్మీర్ శత్రువులు భరించలేకపోయారు’ అని ప్రధాని చెప్పారు.


ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారినైనా, ఏ భాష మాట్లాడే వారినైనా, ఏ భారతీయుడినైనా ఏప్రిల్ 22 నాటి ఉగ్రదాడి తీవ్రంగా కలచివేసిందని ప్రధాని అన్నారు. ‘ఉగ్రదాడి ఫోటోలను చూసిన ప్రతి భారతీయుడి రక్తం ఆగ్రహంతో మరిగిపోతోంది’ అని చెప్పారు. ప్రపంచం మొత్తం భారత్‌తో ఉందని ప్రధాని పేర్కొన్నారు. ‘బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. ఈ దాడి వెనుక ఉన్నవారు కఠినమైన శిక్ష అనుభవించక తప్పదు... ఉగ్రవాదులు, వారి మాస్టర్లు కశ్మీర్‌ను నాశనం చేయాలనే కుట్రను పన్నారు’ అని పేర్కొన్నారు.


‘‘ఉగ్రవాదంపై మేము సాగిస్తోన్న యుద్ధానికి 140 కోట్ల మంది భారతీయుల ఐక్యతే అత్యంత పెద్ద బలం.. ఇదే మన నిర్ణాయక పోరాటానికి బలమైన పునాది. ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు మన ఆత్మస్థైర్యాన్ని బలోపేతం చేయాలి. మనం ఒకటిగా మాట్లాడుతున్న దేశాన్ని ప్రపంచం చూస్తోంది’’ అని ప్రధాని అన్నారు.


ఏప్రిల్ 22న పహల్గామ్‌లో బైసరన్ లోయలో 25 మంది పర్యాటకులు, ఒక కశ్మీరీని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఇది కశ్మీర్ చరిత్రలో జరిగిన అత్యంత భయానకమైన ఉగ్రదాడులలో ఒకటి. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను గుర్తించి, వెంటాడి, శిక్షించడమే లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. "మన మనోభావాలను ఏదీ దెబ్బతీయలేవు’ అని మోదీ ఉద్ఘాటించారు.


‘‘దేశం మొత్తం బాధిత కుటుంబాల వెంట ఉంది... గాయపడినవారిని సంరక్షించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తోంది. కొడుకులను, తోబుట్టువులను, జీవిత భాగస్వామిలను కోల్పోయారు. చనిపోయింది బెంగాలీనా, కన్నడనా, మరాఠీనా, ఒడియానా, గుజరాతీనా, బిహారీనా అనేది కాకుండా కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకూ తీవ్ర దుఃఖం, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దాడి కేవలం పర్యాటకులపై మాత్రమే కాదు; శత్రువులు భారతీయుల ఆత్మపై దాడి చేసినట్లుగా ఉంది’’ అని గత వారం బీహార్‌లోని ఓ సభలో ప్రధాని చెప్పారు.


ఈ దాడికి కారకులైన ప్రతిఒక్కరూ ఊహించలేని శిక్షను ఎదుర్కొంటారని ప్రధాని హెచ్చరించారు. ‘ఉగ్రవాద శిబిరాల.. వారి అవశేషాలను నిర్మూలించడానికి సమయం వచ్చింది.. 140 కోట్ల ప్రజల సంకల్పబలంతో ఉగ్రవాద మాస్టర్ల వెన్ను విరుస్తాం’ అని పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa