ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధ భయాలు.. బంకర్లు సిద్ధం చేసుకుంటున్న భారత్-పాక్ సరిహద్దు ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 09:18 PM

భారత్, పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణంతో సరిహద్దుల్లోని ప్రజలు అలర్ట్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు.. ఇప్పుడు బంకర్లను శుభ్రం చేసి.. వాటిని సిద్ధంగా ఉంచుకుంటున్నారు. ఏ క్షణమైనా యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు రావడంతో వారు అప్రమత్తం అవుతున్నారు. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో నిత్యం కాల్పుల మోతలతో దద్దరిల్లే సరిహద్దు గ్రామాలు గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్నాయి. 2021లో భారత్, పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ ప్రాంత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడితో మళ్లీ వారి భయాలు మొదటికి వచ్చాయి. దీంతో బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.


ఇక పంట కోతల సమయం కావడంతో.. ఒకవైపు పొలాల్లో పంటలు కోసుకుంటునే.. మరోవైపు తమను కాపాడుకునేందుకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన బంకర్లను శుభ్రం చేసి వాటిలో తలదాచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బంకర్లను మహిళలు శుభ్రం చేస్తుండగా.. పురుషులు మాత్రం వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. తాము నిరాయుధులమైన సైనికులమని.. దేశం కోసం పోరాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని.. పాక్ ఉగ్రదాడికి తగిన బుద్ధి చెప్పాలని సరిహద్దు ప్రజలు కోరుతున్నారు. గతంలో భద్రతా దళాల నుంచి "కాల్పులు విరమించండి" అనే హెచ్చరికలు వచ్చేవని.. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తాయేమోనని భయంగా ఉందని స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


 భారత్, పాక్ ఉద్రిక్తతల మధ్య క్షణక్షణానికి పరిస్థితులు మారుతున్నాయని.. సరిహద్దు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బల్బీర్ కౌర్ పేర్కొన్నారు. సరిహద్దు అవతలి నుంచి కాల్పులు జరిగితే తలదాచుకోవడానికి తాము బంకర్లను సిద్ధం చేసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. పహల్గామ్ వంటి దుర్ఘటనలను తాము ఎప్పటికీ సహించేది లేదని.. ఉగ్రవాదులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి.. తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.


మరోవైపు.. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. పాక్ సైన్యం వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అయితే ఈ దాడులను భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రదాడులు, కాల్పుల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా బంకర్లను నిర్మిస్తోంది. 2017లోనే దాదాపు 14 వేల బంకర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వగా.. ఆ తర్వాత మరో 4 వేల బంకర్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa