ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గామ్ ఉగ్రదాడి పూర్తి వీడియో, రికార్డ్ చేసిన వీడియోగ్రాఫర్.. ఎన్ఐఏ చేతికి కీలక ఆధారాలు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 09:17 PM

జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించే దేశ విదేశాలకు చెందిన ప్రకృతి ప్రేమికులు.. తప్పకుండా చూసే ప్రదేశం బైసరన్ లోయ. అక్కడి అద్భుత దృశ్యాలను చూసి.. వాటిని తమ కెమెరాల్లో బంధించుకునేందుకు పర్యాటకులు ఎగబడుతూ ఉంటారు. అయితే ఇటీవల ఉగ్రదాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్న వీడియోగ్రాఫర్ తీసిన వీడియోలు.. ఇప్పుడు ఆ ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తులో కీలక పాత్ర పోషించనున్నాయి. బైసరన్‌కు వచ్చే టూరిస్ట్‌లకు ఫోటోలు, వీడియోలు, రీల్స్ తీసే ఓ స్థానిక వీడియోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు ఇప్పుడు ఈ ఉగ్రదాడికి కీలక ఆధారాలుగా మారాయి. ఈ ఉగ్రదాడిపై విచారణ జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్ఐఏకు ఈ వీడియో దొరికింది. పహల్గామ్‌ ఉగ్రదాడికి సంబంధించిన కీలక ఆధారాలు కలిగిన అత్యంత కీలకమైన ఇప్పుడు ఎన్ఐఏ చేతికి వచ్చింది.


పర్యాటకులపై దాడి చేసేందుకు వచ్చిన ఉగ్రవాదులను చూసి భయాందోళనకు గురైన ఆ వీడియోగ్రాఫర్.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి దాక్కొని.. వారి మారణహోమానికి సంబంధించిన దృశ్యాలను మొత్తం తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియోలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్ఐఏ.. అసలు దాడి ఏ రకంగా జరిగింది అనేది విశ్లేషించే పనిలో పడింది.


ఈ క్రమంలోనే ఉగ్రవాదులు రెండు టీమ్‌లుగా విడిపోయి బైసరన్ లోయలో వేర్వేరు దిక్కుల నుంచి కాల్పులకు తెగబడినట్లు ఆ వీడియోల ఆధారంగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మొదట ఇద్దరు ఉగ్రవాదులు టూరిస్ట్‌లను ముస్లిం మతాచారాన్ని పాటించాలనిని బెదిరించారని.. ఆ తర్వాత దాదాపు నలుగురు పర్యాటకులను కాల్చి చంపినట్లు అందులో ఉంది. ఈ కాల్పులతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో టూరిస్ట్‌లు ఎక్కడికక్కడ పారిపోయారు. ఇక అదే సమయంలో జిప్‌లైన్‌ అనే ప్రదేశం నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులు బయటికి వచ్చి టూరిస్ట్‌లపై కాల్పులు జరిపారు.


ఈ ఉగ్రదాడి జరుగుతుండగా.. ఆ వీడియోగ్రాఫర్‌ తన ప్రాణాలు దక్కించుకునేందుకు చెట్టు కొమ్మపైకి ఎక్కి దాక్కుని.. ఆ తర్వాత మొత్తం వీడియో తీసినట్లు ఎన్ఐఏ సీనియర్‌ అధికారి తెలిపారు. ఇక తాజాగా ఆ వీడియోగ్రాఫర్‌ను గుర్తించి అతడిని ప్రశ్నించి కీలక ఆధారాలను ఎన్ఐఏ సేకరించింది. అయితే ఈ దాడి చేసేందుకు ఉగ్రవాదులకు.. సహకరించిన వారిని గుర్తించేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.


మరోవైపు.. ఈ ఉగ్రదాడి సందర్భంగా కాల్పులు జరిపిన ముష్కరులు కొందరి ఫోన్లను లాక్కున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అక్కడికి వచ్చిన ఒక టూరిస్ట్‌ ఫోన్‌తోపాటు.. స్థానికుడి ఫోన్ కూడా బెదిరించి తీసుకున్నట్లు వెల్లడైంది. దీంతో ఆ రెండు ఫోన్లను ట్రాక్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆ ఫోన్లను ట్రాక్ చేస్తే.. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు అనేది తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రదాడి తర్వాత ఆ రెండు ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసినట్లు గుర్తించారు. మరోవైపు.. ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఎం4 రైఫిల్‌లకు సంబంధించిన ఖాళీ తూటాలు స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa