ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని షెహబాజ్‌ షరీఫ్‌కు మాజీ ప్రధాని సూచన

international |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 07:05 PM

భారత్‌తో ఇటీవల తీవ్రరూపం దాల్చిన ఉద్రిక్తతల నేపథ్యంలో సమస్య పరిష్కారానికి దౌత్య మార్గాలను అనుసరించడమే ఉత్తమమని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, తన సోదరుడు, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో నవాజ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఈ సలహా ఇచ్చినట్లు సమాచారం."రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగినవి. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అందుబాటులో ఉన్న ప్రతి దౌత్య మార్గాన్ని ఉపయోగించుకోవాలి" అని నవాజ్ షరీఫ్, ప్రధాని షెహబాజ్‌తో అన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం పాటించి, చర్చల ద్వారానే ముందుకు వెళ్లాలని ఆయన సూచించినట్లు సమాచారం.ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ ఘటన తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలని నిర్ణయించడంతో పాటు, పాకిస్థానీ పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు బదులుగా సిమ్లా ఒప్పందంతో సహా ఇతర ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడమే కాకుండా, భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa