ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి ట్రైనీ ఉద్యోగులను తొలగించింది. అంతర్గత అసెస్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైన కారణంగా తాజాగా 195 మంది ట్రైనీలను ఆ సంస్థ తొలగించింది. ఈ ఏడాదిలో కంపెనీ ట్రైనీలను తొలగించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ మేరకు సంబంధిత ట్రైనీలకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.ఈ తొలగింపులతో కలిపి, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ సుమారు 800 మంది ట్రైనీలను తొలగించింది. 2022లో నియమితులైన ఈ ట్రైనీలను 2024 అక్టోబర్లో విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. అంతర్గత శిక్షణ అనంతరం నిర్వహించిన తుది పరీక్షలో నెగ్గలేకపోవడమే ప్రస్తుత తొలగింపులకు కారణంగా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.అయితే, తొలగించిన ట్రైనీలకు ఒక నెల ఎక్స్గ్రేషియాతో పాటు రిలీవింగ్ లెటర్ను అందజేస్తోంది. అంతేకాకుండా, ఎన్ఐఐటీ, అప్గ్రాడ్ వంటి సంస్థల ద్వారా ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తోంది. ఇప్పటివరకు సుమారు 250 మంది ఈ శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోగా, మరో 150 మంది ఇన్ఫోసిస్ అందిస్తున్న ఔట్ప్లేస్మెంట్ సేవల కోసం నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇన్ఫోసిస్ తొలుత ఫిబ్రవరిలో 300 మంది ట్రైనీలను తొలగించింది. మార్చిలో 30-35 మందిని, ఏప్రిల్లో 240 మందిని తొలగించింది. తాజా తొలగింపు నాలుగోది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ మొత్తం 15,000 మంది ట్రైనీలను నియమించుకున్నట్లు గతంలో వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa