శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని నెల్లూరు ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పొతిరెడ్డిపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు.. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వైద్య విద్యార్థులు, ఇంటిలో నివశిస్తున్న వెంకట రమణయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో వైద్య విద్యార్థికి గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో సెకండియర్ చదవుతున్న ఆరుగురు విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెంలో ఓ శుభకార్యానికి వెళ్లారు. స్నేహితుడి అక్క నిశ్చితార్థానికి వెళ్లి.. కారులో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే పొతిరెడ్డిపాలెం వద్దనున్న పెట్రోల్ బంక్ సమీపానికి రాగానే కారు అదుపుతప్పింది. దీంతో హైవే పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ఇంట్లో ఉన్న వెంకటరమణయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కారులోని విఘ్నేష్, జీవన్, విఘ్నేష్, నరేశ్, అభిసాయి, అభిషేక్, మౌనిత్ రెడ్డి అనే మెడికల్ స్టూడెంట్స్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు విద్యార్థులు చనిపోయారు. మౌనిత్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాద ఘటనపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఇలా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో వారి కుటుంబాలు గుండెలు పగిలేలా రోదిస్తున్నాయి. బాగా చదువుకుని మంచిపేరు తెచ్చుకుంటారనుకుంటే.. ఇలా అయ్యిందంటూ మృతుల కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. మరోవైపు కారు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దీనిపైనా కోవూరు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa