మెట్రో రైళ్లు.. మన రవాణా వ్యవస్థను మరో మెట్టుకు తీసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్లలో ప్రజలు విలాసవంతమైన ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, మెట్రో రైళ్లలో ఆహార పదార్థాలు తినడం నేరమని తెలుసా..? బెంగళూరుకు చెందిన ఓ మహిళ.. పాపం ఆకలికి తాలలేక తన లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకొని మెట్రో రైల్లో ప్రయాణిస్తూనే భోజనం చేసింది. ఆ కోచ్లో ఉన్న ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో బెంగళూరు మెట్రో యాజమాన్యం చర్యలు తీసుకుంది.
ఏప్రిల్ 26న బెంగళూరులోని మదవర మెట్రో స్టేషన్ నుంచి మగధ రోడ్ మెట్రో స్టేషన్ వరకు ఓ మహిళ ప్రయాణించింది. ఆ సమయంలో తన వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి, తినేసి ఆకలి తీర్చుకొంది. ప్రయాణికుల్లో ఒకరు ఆ దృశ్యాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. అది కాస్త బెంగళూరు మెట్రో యాజమాన్యం దృష్టికి వెళ్లింది.
వైరల్ వీడియోలోని మహిళను గుర్తించిన బెంగళూరు మెట్రో సిబ్బంది ఆమె వివరాలు తెలుసుకొని.. 500 రూపాయల జరిమానా విధించారు. ప్రయాణిస్తున్న మెట్రో రైల్లో తినుబండారాలు తినడం, పానీయాలు తాగడం నిషేధం అని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉన్నందున ఫైన్ విధించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో రైలు కోచ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ఇలాంటి నిబంధనలు రూపొందించినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థమే మహిళపై చర్యలు తీసుకున్నట్టు వివరించారు.
ఇక మెట్రో రైళ్లలో, స్టేషన్లలో పొగాకు వినియోగం, రవాణా చేయడం పైనా కఠిన నిబంధనలు ఉన్నాయని బెంగళూరు మెట్రో మేనేజ్మెంట్ ఇటీవల తెలిపింది. మెట్రో రైలులో ఓ వ్యక్తి గుట్కా నములుతున్న వీడియో వైరల్ కావడంతో నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మెట్రో రూల్స్, పరిసరాల పరిశుభ్రతపై పౌరులకు విస్తృత అవగహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఓ ప్రకటనలో కోరింది.
బెంగళూరు మెట్రో రైల్లో ఆహారం తిన్నందుకు ఫైన్ విధించిన ఘటనపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రైళ్లలో అపరిశుభ్రంగా మార్చే వాళ్ల పైనా ఇలాంటి ఫైన్లు విధించాలని కోరుతున్నారు. కొంత మందికి తమ ఇల్లు, తమకు సంబంధించిన వస్తువుల పట్ల ఉన్నంత శ్రద్ధ.. ప్రభుత్వ ఆస్తులు, తోటి వారి వస్తువులపై ఉండదు. ఇక పబ్లిక్ ప్రాపర్టీ అయితే మరీ నిర్లక్ష్య కనబరుస్తుంటారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రైళ్లలో మరింత నిర్లక్ష్యంగా ఉంటారు. అపరిశుభ్రం చేయడమే తమ జన్మహక్కు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. తోటి ప్రయాణికులు అసౌకర్యంగా ఫీలవుతారనే కనీస ఇంగితం కూడా లేకుండా.. తినుబండారాలు, ఆహార పదార్థాల వ్యర్థాలు, వాటర్ వాటిల్స్ నిర్లక్ష్యంగా పడేస్తుంటారు. ఇక పరిసరాలను పాన్ పరాగ్లతో నింపేసేవాళ్లు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa