ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్‌ వివేకానందరెడ్డి మిస్టరీ... మూడు మేసెజ్ లు ఎందుకు డిలీట్ చేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 01:15 PM

ఎన్నికల ముంగిట జరిగిన వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో రాజకీయ పార్టీలకు ముడిసరుకుగా మారింది. వివేకానంద హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ సూత్రధారులు, మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్రధారి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించగా, హత్యను సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది ఎవరో తేలాల్సి ఉందని ముఖ్యమంత్రి బదులిచ్చారు. నిజానికి ఈ హత్యోదంతం ఆసాంతం మిస్టరీగా అనిపిస్తోంది. వివేకానందరెడ్డి తన స్వగృహంలో హత్యకు గురయ్యారు. ఆయన దారుణ హత్యకు గురైతే గుండెపోటుతో మరణించారని బంధువర్గం తొలుత ప్రచారం చేసింది.


జగన్మోహన్‌రెడ్డి సొంత చానల్‌లో కూడా వివేకాది సహజ మరణంగా ప్రచారం చేశారు. తెల్లవారుజామున హత్య జరిగితే ఆయన గుండెపోటుతో మరణించారని నమ్మించే ప్రయత్నం చేయడానికి కారణం ఏమిటి? అందుకు కారకులు ఎవరు? తేలితే తప్ప.. ఈ హత్య మిస్టరీ వీడదు.రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కనపెడితే వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయాన్ని కుటుంబసభ్యులు ఎందుకు బయటకు చెప్పలేదు? వివేకానంద శరీరంపై గాయాలున్నాయని మీడియా సందేహాలు వ్యక్తంచేయడం, పోస్టుమార్టం నివేదికలో ఆయన హత్యకు గురయ్యారన్న విషయం నిర్ధారణ అయ్యే వరకు జరిగింది హత్య అని కుటుంబసభ్యులు, బంధువులు ఎందుకు చెప్పలేదో తెలియదు.

వివేకా హత్యకు గురయ్యారని పోలీసులు ప్రకటించిన తర్వాతే రాజకీయాలు మొదలయ్యాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీరిగ్గా శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ వివేకా హత్య వెనుక చంద్రబాబు హస్తముందని ఆరోపించారు. మరీ మూడు వారాల్లో ఎన్నికలు పెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా, ముఖ్యంగా అధికార పార్టీ హత్యలు చేయిస్తుందా? అని ఒక విలేకరి వేసిన ప్రశ్నకు విజయసాయిరెడ్డి నీళ్లు నమిలారు. ఈ హత్యోదంతంలో అసలు ఏం జరిగిందన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. సమీరా అనే మహిళ పేరిట ఉన్న ఫోన్‌ నుంచి వివేకానందరెడ్డికి అర్ధరాత్రి 1:30 గంటలకు ఒక మెసేజ్‌ వచ్చింది. ‘‘నీ కూతురు వల్ల మేం నాశనమయ్యాం. ఇందుకు తగిన శిక్ష అనుభవిస్తావు. దేవుడు ఉన్నాడు’’ అన్నది ఆ సందేశం సారాంశం.దీన్ని ఒక రెడ్డిగారు పంపారు. ఆ తర్వాత మరో మూడు మెసేజ్‌లు కూడా వివేకానందకు వచ్చాయి. అప్పటికే తెల్లవారుజామున మూడున్నర గంటలు అయింది. అయితే ఈ మూడు మెసేజ్‌లను వివేకా తొలగించారు. ఆ మెసేజ్‌ల సారాంశం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో కానీ తేలదు. దీన్నిబట్టి తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు వివేకానంద జీవించే ఉన్నారని భావించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తేలాల్సి ఉంది.

బెడ్‌రూములో హత్య చేసి మృతదేహాన్ని బాత్‌రూమ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆయన శరీరంపై ఉన్న దుస్తులను కూడా మార్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. శవం బెడ్‌రూమ్‌లో కాకుండా బాత్‌రూమ్‌లో ఎందుకు పడి ఉంది? బెడ్‌రూమ్‌లో ఉన్న రక్తపు మరకలను శుభ్రపరిచింది ఎవరు? ఆ అవసరం ఎవరికి ఉంది? శరీరంపై అన్ని గాయాలున్న విషయం తెలిసి కూడా వివేకానందది సహజ మరణం అని ప్రచారం చేయవలసిన అవసరం ఏమిటి? ఇలాంటి పలు ప్రశ్నలకు సమాధానాలు లభించిన తర్వాతే ఈ మిస్టరీ వీడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa