రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ముందుకొచ్చి తెదేపాకు ఓటేయాలని ప్రచారం చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయనగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ‘‘24 రోజులు అన్ని బాధ్యతలు ఇంట్లో వాళ్లకి అప్పజెప్పి రోజుకు రెండు గంటలు పార్టీ కోసం పని చేయండి. స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వండి. రూ.1, లేదా రూ.2, లేదా రూ.3 పార్టీ కోసం ఇచ్చి ఓటు కూడా వేయండి. పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. నా కష్టానికి కూలి అడుగుతున్నా. విజయనగరంలో ఉన్న తొమ్మిది సీట్లు మనమే గెలవాలి. నీతి, నిజాయతీగా ఉంటామని మీకు హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. ఇన్ని చేశాక కూడా వేరే వాళ్లకి ఓటేస్తారా..? ఐదేళ్లు కష్టపడి పని చేశాం. నేను కుటుంబంతో కూడా సరిగ్గా గడపలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపనతోనే ఇదంతా చేశా. రాష్ట్ర హక్కులు కాపాడేందుకు పోరాడడంలో మనమే ముందున్నాం. మీ భవిష్యత్తు నా బాధ్యత అని నేను చెప్తున్నా.. ‘నా భవిష్యత్తు మీ బాధ్యత’ అని జగన్ వస్తున్నాడు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి జైలుకు పోకుండా ఉండాలంటే ఆయనకు మీరు ఓటేయాలి. అలాంటి వ్యక్తికి ఓటేస్తారా?. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తెదేపాకు శ్రీరామరక్ష. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారు ప్రచారానికి సిద్ధంగా ఉన్నారు.’’ తెదేపా తప్ప రాష్ట్రంలో మరెవరికీ ఓటడిగే హక్కు లేదని లబ్ధిదారులు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa