రోజూ స్నానం చేయడం ప్రతి ఒక్కరి అలవాటు. మంచి ఆరోగ్యం కోసం రోజూ స్నానం చేయడం చాలా అవసరం. స్నానం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా రీఫ్రెష్గా ఉంటారు. అయితే, భారతదేశంలో చాలా మంది ఉదయం పూట స్నానం చేస్తుంటారు. కానీ, చైనా, జపాన్, కొరియా వంటి దేశాల్లో రాత్రి సమయాల్లో స్నానం చేస్తారు. అయితే, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు స్నానం చేస్తే మంచిదని. అసలు సైన్స్ ఏం చెబుతుంది, ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
జపాన్, కొరియా ప్రజలు స్నానం చేసే టైమ్
జపాన్లో చాలా మంది సాయంత్రం లేదా రాత్రి స్నానం చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ రాత్రి స్నానం చేసే అలవాటు వారి పురాతన సంప్రదాయం నుంచి వస్తుంది. రాత్రి స్నానం పగటిపూట శరీరంపై పేరుకుపోయిన టాక్సిన్లను, మురికిని వదిలించుకోవడానికి సాయపడుతుంది. ఇది రిలీఫ్ కూడా అందిస్తుంది. అదేవిధంగా, దక్షిణ కొరియాలో కూడా ఎక్కువ గంటలు పనిచేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ప్రజలు రాత్రి స్నానం చేయడానికి ఇష్టపడతారు. అయితే, అమెరికా, యూరప్, కెనడా వంటి దేశాల్లో ఉదయం పూట స్నానం చేస్తారు. రోజంతా తాజాగా ఉండటానికి వాళ్లు ఉదయం స్నానం చేస్తారు.
చైనా ప్రజలు స్నానం ఎప్పుడు చేస్తారంటే
చైనీస్ సంస్కృతిలో కూడా, ప్రజలు రాత్రి స్నానం చేయడానికి ఇష్టపడతారు. అక్కడ దీనిని రోజువారీ పరిశుభ్రతలో ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. అంతేకాకుండా రోజంతా బయట ఉండి సాయంత్రం స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని చైనీయులు నమ్ముతారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే, చైనా వాతావరణం తేమగా, ఉష్ణమండలంగా ఉండటం ఒక కారణం. అందుకే అక్కడ జనాలకు బాగా చెమట పడుతుంది. దీంతో, వారికి అనేక రకాల చర్మవ్యాధులు వస్తాయి. దీంతో, వాళ్లు రాత్రి సమయంలో స్నానం చేస్తారు.
సైన్స్ ఏం చెబుతుంది?
సైన్స్ ప్రకారం రాత్రిపూట స్నానం చేయడం మంచిదని భావిస్తారు నిపుణులు. రోజులోని హడావిడి తర్వాత స్నానం చేయడం వల్ల శరీరం రీఫ్రెష్ అవుతుంది. రాత్రి స్నానం చేయడం వల్ల రోజంతా ఉన్న అలసట నిమిషాల్లో మాయమవుతుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. అందుకే చాలా మంది ఉదయం స్నానం చేయడమే కాకుండా రాత్రి కూడా స్నానం చేస్తారు. రాత్రి పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుందని పరిశోధనలో తేలింది. అయితే, ఉదయం స్నానం కూడా ముఖ్యం, ముఖ్యంగా రోజంతా చురుకుగా ఉండాలనుకునే వారికి.
ఆయుర్వేదం ఏం చెబుతుంది?
ఆయుర్వేదంలో స్నానం చేయడం శరీరం, మనసు, ఆత్మను తాజాగా, ప్రశాంతంగా ఉంచడానికి పని చేసే చికిత్స చర్య. ఆయుర్వేదంలో ఉదయాన్నే తలస్నానం చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందు ,సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడం మంచిదని ఆయుర్వేదం చెబుతుంది.
మధ్యాహ్నం స్నానం చేస్తే
సైన్స్ లేదా ఆయుర్వేదం ప్రకారం మధ్యాహ్నం సమయంలో స్నానం చేయడం మంచిది కాదు. మధ్యాహ్నం స్నానం చేయడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలా చేయడం వల్ల కండరాలను కప్పి ఉంచే కణాలకు వాపు వస్తుంది, దీనిని మైయోసిటిస్ అంటారు. మధ్యాహ్నం స్నానం చేస్తే నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
భోజనం తర్వాత కూడా వద్దు
భోజనం చేసిన తర్వాత కూడా స్నానం వద్దని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వత..ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి, పొట్టకు సరైన మొత్తంలో రక్తప్రసరణ అవసరం. అయితే స్నానం వల్ల ఆ రక్తం చర్మం వైపు ప్రసరించి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. దీంతో ఆహారం జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. దీంతో అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే భోంచేశాక గంట, గంటన్నర తర్వాత స్నానం చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa