వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్ యూజీ-2025 దేశవ్యాప్తంగా విజయవంతంగా ముగిసింది. జాతీయ పరీక్షల మండలి NTA ఈ పరీక్షను భారత్లోని 548 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 5,453 కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించింది. ఈ ఏడాది సుమారు 20.8 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరైనట్లు NTA వర్గాలు వెల్లడించాయి.పరీక్షను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు NTA ఈసారి సమగ్ర విధానాన్ని అనుసరించింది. కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కేంద్రీకృత కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రక్షణ, హోం శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ కంట్రోల్ రూమ్ నుంచి క్షేత్రస్థాయిలో పరీక్షల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించారు.నిర్వహణా సంసిద్ధతను పరీక్షించేందుకు మే 3న అన్ని కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. మొబైల్ సిగ్నల్ జ్యామర్ల పనితీరు, బయోమెట్రిక్ హాజరు నమోదు, తనిఖీల కోసం అవసరమైన సిబ్బంది లభ్యత వంటి అంశాలను ఈ డ్రిల్స్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లాజిస్టిక్స్, భద్రతా పరమైన అంశాలను సులభతరం చేసేందుకు చాలా వరకు కేంద్రాలను ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థల్లోనే ఏర్పాటు చేశారు.వేసవి కాలం, మధ్యాహ్నం పూట పరీక్ష కావడంతో విద్యార్థుల సౌకర్యార్థం అన్ని కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స, మొబైల్ టాయిలెట్ల వంటి కనీస వసతులను అధికారులు కల్పించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంబులెన్స్ సేవలను కూడా సిద్ధంగా ఉంచారు.పరీక్షకు సంబంధించి తప్పుడు సమాచారం, మోసపూరిత ప్రచారాలను అరికట్టేందుకు NTA ఏప్రిల్ 26న 'సందేహాస్పద ఫిర్యాదుల రిపోర్టింగ్ పోర్టల్'ను ప్రారంభించింది. దీని ద్వారా సుమారు 2,300 ఫిర్యాదులు అందాయని, వీటి ఆధారంగా తప్పుడు ప్రశ్నపత్రాల లీక్ వార్తలను ప్రచారం చేస్తున్న 106 టెలిగ్రామ్, 16 ఇన్స్టాగ్రామ్ ఛానెళ్లను గుర్తించినట్లు NTA తెలిపింది. తదుపరి చర్యల కోసం ఈ వివరాలను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు నివేదించారు.పరీక్షకు ముందు కేంద్ర విద్యా శాఖ దేశవ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించింది. బహుళ అంచెల తనిఖీలు, పరీక్షా సామగ్రి సురక్షిత రవాణా, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అక్రమ మార్గాల నివారణ చట్టం, 2024ను కఠినంగా అమలు చేయడం వంటి చర్యలను చేపట్టారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa