ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతలపై ఐరాస భద్రతా మండలి అత్యవసర భేటీ

international |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 11:25 PM

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమవారం (మే 5న ) అత్యవసరంగా సమావేశం కానుంది. ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ ఐరాస ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ఏర్పడిన పరిణామాలపై ముఖ్యంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసి విషయంపై ఐక్యరాజ్యసమితి దృష్టి తీసుకొచ్చేందుకు తమ వైపు నుంచి వివరాలు ఇవ్వనున్నామని వెల్లడించింది.


‘‘ఈ మౌలికమైన దౌత్యపరమైన చర్య గురించి అంతర్జాతీయ సమాజానికి నిజానిజాలను వివరించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుంది’ అని భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కలిగిన పాక్ ప్రకటించింది. పహల్గామ్ దాడి వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందని భావించిన భారత్.. ఆ దేశంపై దౌత్యపరమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు ఒకటి. పహల్గామ్ దాడికి పాక్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయని భారత్ పేర్కొంది. దాయాది మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని.. నిష్పాక్షిక విచారణ జరగాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, పాకిస్థాన్ నాయకులు తమపై భారత్ ప్రతీకార దాడికి సిద్దంగా ఉందని.. తామూ అణ్వాయుధాలను సిద్దం చేశామని బెదిరింపులకు దిగుతున్నారు.


వారం రోజుల కిందట ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్‌ను హెచ్చరించిన భారత్.. ఈ అంతర్జాతీయ వేదికను తప్పుగా ఉపయోగించుకుంటూ, అసత్య ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తన దౌత్యపరమైన ప్రయత్నాల్లో భాగంగా భద్రతా మండలిలోని ఎనిమిది తాత్కాలిక సభ్య దేశాలకు కూడా భారత్ సమాచారాన్ని అందజేసింది. భారత్ ప్రతీకార దాడుల భయంతో పీఓకేలోని ఉగ్రవాదులను పాక్ సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.


పహల్గామ్ దాడి అనంతరం పాకిస్థాన్‌పై పలు చర్యలు చేపట్టిన భారత్.. పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దుచేసి వారిని దేశం నుంచి బహిష్కరించింది. అట్టారి సరిహద్దు మార్గాన్ని తక్షణం మూసివేసింది. దీనికి ప్రతిస్పందగా పాక్.. సిమ్లా ఒప్పందం నుంచి వైదొలగడం, భారతీయ విమానాలు తన గగనతలం నుంచి ప్రయాణించకుండా నిషేధించింది. ఢిల్లీతో నేరుగా, మూడో దేశాల ద్వారా జరిగే వాణిజ్యాన్ని సైతం నిలిపివేసింది. అంతేకాక, భారత్ సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేసిన చర్యను తిరస్కరించింది. ఇందులో భాగంగా నీటిని ఆపడానికి భారత్ ఎలాంటి ప్రయత్నమైనా చేస్తే, యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa