ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా పర్యటనకు చైనా అధ్యక్షుడు

international |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 11:30 PM

చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌‌పింగ్ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. మాస్కోలో మే 9వ తేదీ విక్టరీ డే పరేడ్ జరగనుంది. ఈ నేపథ్యంలో విక్టరీ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనేందుకు షీ జిన్‌పింగ్‌కు రష్యా నుంచి ఆహ్వానం అందింది. దీంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా వెళ్తున్నారు. ఈ మేరకు జిన్‌పింగ్ రష్యా పర్యటనను రష్యా అధికారులు అధికారికంగా ప్రకటించారు. మే 7 నుంచి మే 10 వరకూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌పింగ్ రష్యాలో పర్యటించనున్నట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ అధికారికంగా ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు జిన్ పింగ్ రష్యాకు వస్తున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది.. విక్టరీ డే వేడుకల్లో పాల్గొనటంతో పాటుగా ఇరుదేశాల వ్యూహాత్మక సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చలు జరుపుతారని పేర్కొంది. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చి్స్తారని తెలిపింది. ఈ సందర్భంగా రష్యా, చైనా పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు వెల్లడించింది.


2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌లోకి సైన్యాన్ని పంపిన తర్వాత జిన్‌పింగ్ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది మూడోసారి. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తాము తటస్థ వైఖరిని అవలంభిస్తున్నట్లు చైనా చెప్తోంది. అయితే పశ్చిమ దేశాలు రెచ్చగొట్టడమే రష్యా చర్యలకు కారణమనే క్రెమ్లిన్ వాదనలకు చైనా మద్దతు తెలుపుతోంది. అంతేకాదు ఆయుధాల ఉత్పత్తికి మాస్కోకు అవసరమైన కీలక భాగాలను చైనా సరఫరా చేస్తూనే ఉంది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత జిన్ పింగ్ 2023లో రష్యాలో అధికారికంగా పర్యటించారు. అనంతరం రష్యా అధ్యక్షుడుు వ్లాదిమిర్ పుతిన్ 2023 అక్టోబర్‌లో చైనాను సందర్శించారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు మే 2024లో బీజింగ్‌లో సమావేశమయ్యారు. 2024 సెప్టెంబర్‌లోనూ బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం జిన్‌పింగ్ రష్యాలో పర్యటించారు. ఇప్పుడు మూడోసారి రష్యా పర్యటనకు వెళ్తున్నారు.


  మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రష్యా పర్యటనకు వెళ్లాల్సి ఉండేది. విక్టరీ డే వేడుకలకు రావాలంటూ పుతిన్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. అయితే పహల్గాం ఉగ్రదాడి, భారత్ పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ రష్యా పర్యటన రద్దయ్యింది. ఈ విషయాన్ని క్రెమ్లిన్‌ ఇటీవల ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా విక్టరీ డే వేడుకలు జరుపుకుంటోంది. మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో ఈ సందర్భంగా భారీ స్థాయిలో సైనిక కవాతు నిర్వహిస్తారు. విక్టరీ డే వేడుకలు ఈ సారి 80 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో 80వ వార్షికోత్సవం సందర్భంగా మిత్ర దేశాధినేతలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa