సంగారెడ్డి జిల్లాలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపి.. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ఆర్ఎంపీ. ఈ దారుణ ఘటన ఐదు రోజుల క్రితం జరగ్గా.. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఆదివారం (మే 04న) గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగలగొట్టి చూడగా.. ముగ్గురి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి.
మృతులను సుభాష్ (40), అతని కుమారుడు రిథిక్ మర్యాన్ (9), కుమార్తె ఆరాధ్య (5)గా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో భార్య మంజుల (35)కు వేరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం బయటపడింది. ఈ కారణంగా గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం మంజుల పుట్టింటికి వెళ్లిపోవడంతో సుభాష్ తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్నాడు.
భార్య ప్రవర్తనతో తీవ్ర మానసిక వేదనకు గురైన సుభాష్, అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. తొలుత తన ఇద్దరు అమాయక పిల్లలైన రిథిక్ మర్యాన్కు, ఆరాధ్యకు ఉరివేసి చంపి, ఆ తర్వాత తను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటనతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. సంఘటనా స్థలంలో మృతుడు సుభాష్ రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో తన భార్య మంజుల ప్రవర్తన వల్లే తాను తన పిల్లలతో సహా చనిపోతున్నానని సుభాష్ స్పష్టంగా పేర్కొన్నాడు. తన భార్యకు డబ్బు ఆశ చూపి కొందరు ఆమెను శారీరకంగా వాడుకున్నారని కూడా ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. మంజులకు ఎన్నిసార్లు చెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తరచూ గొడవలు జరిగేవని సుభాష్ తన సూసైడ్ నోట్లో వివరించాడు. తన భార్య వివాహేతర సంబంధాల గురించి ఒక్కొక్కటిగా పేర్కొంటూ అతను తన ఆవేదనను నాలుగు పేజీల లేఖలో నింపాడు. ఈ ఘటన సంగారెడ్డి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa