ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో ఘోరం.. ఘాట్ రోడ్డులో అరుదైన జంతువు మృతి

Crime |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 11:42 PM

తిరుమల ఘాట్ రోడ్డులో అరుదైన జంతువు ప్రాణాలు కోల్పోయింది. రెండవ ఘాట్ రోడ్డులో 13వ కిలోమీటర్‌కు సమీపంలో.. అరుదుగా కనిపించే పునుగు పిల్లి ఘాట్ రోడ్డులో చనిపోయింది. పునుగు పిల్లి రోడ్డు దాటుతున్న సమయంలో.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. పునుగు పిల్లి అక్కడే రోడ్డుపై మృతిచెందింది. పునుగు పిల్లి నుంచి వచ్చే తైలం అంటే తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రం అని చెబుతుంటారు. అందుకే టీటీడీ ప్రత్యేకంగా ఈ పునుగు పిల్లు్ల్ని సంరక్షిస్తోంది. తిరుమల శ్రీవారికి అభిషేకాల సమయంలో ఈ పునుగు పిల్లి నుంచే వచ్చే తైలాన్ని ఉపయోగిస్తారు.


తిరుమలతో పాటుగా చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో పునుగు పిల్లులు ఎక్కువగా ఉండేవి. ఈ పునుగు పిల్లులు అటవీ ప్రాంతాన్ని విడిచి అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చి కనిపిస్తుంటాయి. ఈ పునుగు పిల్లులు అంతరించిపోతున్న జీవుల్లో ఒకటిగా ఉంది. ఒకానొక సమయంలో ఈ జాతి పిల్లులు శేషాచలంలో అటవీ ప్రాంతంలో అంతరించిపోయాయని అటవీ శాఖ గణాంకాలు చెప్పాయి. అందుకే టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటిని ఒకచోట సంరక్షిస్తుంది.. వీటి కోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.


టీటీడీ తిరుమల శ్రీవారి అభిషేకానికి వాడే పునుగు తైలం కోసం పునుగు పిల్లులను పెంచుతున్నారు. ఈ పిల్లుల కోసం తిరుపతిలో ఉన్న జూపార్కులో కొత్త నివాసాలు కట్టనున్నారు. 2024 డిసెంబర్ 24న టీటీడీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయగా.. ఇటీవల ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.1.97 కోట్లతో ఈ పనులు చేయనున్నారు.. పునుగు పిల్లుల సంరక్షణ కోసం అత్యాధునిక సౌకర్యాలు, "నాక్టనల్ హౌస్" వంటివి కల్పించనున్నారు. గతంలో ఈ పిల్లులను టీటీడీ గోశాలలో, పూజారుల ఇళ్లలో పెంచేవారు. కానీ అటవీ చట్టం ప్రకారం వాటి పెంపకంపై నిషేధం ఉండటంతో.. వాటిని జూపార్కుకు తరలించారు. ప్రస్తుతం అక్కడ తక్కువ వసతులు ఉన్నాయి.. వాటి మరణాలు తగ్గించి, సంతానోత్పత్తిని పెంచేలా ప్లాన్ చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో ఇటీవల ఒక పునుగు పిల్లి కనిపించింది. ఒక ఇంటి దగ్గర అది తిరుగుతూ ఉండగా.. స్థానికులు దాన్ని పట్టుకుని బోనులో బంధించారు.


వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.. వారు ఆ పిల్లిని స్వాధీనం చేసుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అంతేకాదు గతంలో శ్రీశైలంలో కూడా పునుగు పిల్లులు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే తిరుమల ఘాట్ రోడ్డులో ఈ అరుదైన పునుగు పిల్లి చనిపోవడం బాధాకరం అంటున్నారు భక్తులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa