ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో కెప్టెన్గా, బౌలర్గా ఆశించిన మేర రాణించలేకపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వర్చువల్ నాకౌట్ మ్యాచులో అదరగొట్టాడు. ప్లే ఆఫ్స్ అవకాశాలు నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో సత్తా చాటాడు. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచులో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మూడు వికెట్లు తీశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్కు బ్యాటింగ్ అప్పగించాడు. తాను సరైన నిర్ణయమే తీసుకున్నానని రుజువు చేసేలా పవర్ప్లే లోనే అదరగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే కరుణ్ నాయర్ను గోల్డెన్ డక్ చేశాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో ఫాఫ్ డుప్లెసిస్ (3), అభిషేక్ పోరెల్ (8)లను పెవిలియన్ పంపించాడు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్ వేయడం.. బ్యాట్ను ముద్దాడుతూ వెళ్లి బంతి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతిలో పడటం.. ఇదే తంతు. మూడు వికెట్లు ఇదే తరహాలో వచ్చాయి.
ఆ తర్వాత కేఎల్ రాహుల్ (10), కెప్టెన్ అక్షర్ పటేల్ (6) కూడా త్వరగానే ఔట్ అయ్యారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు ఐపీఎల్లోనే అత్యల్ఫ స్కోరు (ఆర్సీబీ పేరిట ఉన్న 49 రన్స్) కంటే తక్కువకే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, ట్రిస్టన్ స్టబ్స్ (36 బంతుల్లో 41 రన్స్ నాటౌట్), విప్రాజ్ నిగమ్ (18), అశుతోష్ శర్మ (26 బంతుల్లో 41 రన్స్) పోరాడటంతో ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 రన్స్ చేసింది.
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీశాడు. జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ ఒక్కో వికెట్ తీశారు. ఉనద్కత్ 4 ఓవర్లు వేసి కేవలం 13 రన్స్ మాత్రమే ఇవ్వడం గమనార్హం. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే ఉప్పల్ మైదానంలో భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ కనీసం 6 ఓవర్లు కూడా కొనసాగే పరిస్థితి లేకపోతే ఇరు జట్లకూ చెరొక పాయింట్ చొప్పున కేటాయిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa