రిజర్వేషన్లపై భారత అత్యున్నత న్యాయస్థానం నేడు షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దేశంలోని కుల ఆధారిత రిజర్వేషన్లు రైలు బోగీల్లాంటివని తెలిపింది. అందులోకి ప్రవేశించిన వారెవరూ.. కొత్త వాళ్లని లోపలికి రానివ్వరు అంటూ వ్యాఖ్యానించింది. ముఖ్యంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కామెంట్లు చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మహారాష్ట్రలో 2016-17వ సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అయితే ఓబీసీ కోటా విషయంలో గొడవలు జరగ్గా.. న్యాయ పోరాటానికి దిగారు. ఇలా చాలా ఏళ్లుగా ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఓబీసీలకు 27 శాతం కోటాను అమలు చేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్సును 2021లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. అలాగే రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని గుర్తించాలంటూ ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ సిఫార్సుల దృష్ట్యా స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ల నిష్పత్తిని పేర్కొనాలని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని చెప్పింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం డేటాను సేకరిస్తుండగా.. స్థానిక ఎన్నికల్లో జాప్యం జరుగుతూ వస్తోంది.
అయితే తాజాగా మరోసారి ఈ కేసు విచారణ జరగా.. ఓబీసీలకు సంబంధించిన డేటా ఉన్నప్పటికీ.. దాన్ని మహారాష్ట్ర సర్కారు ఉపయోగించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టులో వాదించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారుల ద్వారా స్థానిక సంస్థలను ఏక పక్షంగా నడుపుతుందని కూడా ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందేందుకు ఓబీసీల్లోనే వెనుకబడిని వారిని గుర్తించాలని మరో న్యాయవాది తన వాదనను వినిపించారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దీనిపై స్పందించారు.
దేశంలో రిజర్వేషన్లు రైలు బోగీలుగా మారాయని అన్నారు. అలాగే అందులోకి ప్రవేశించిన వ్యక్తులు ఇతరులను తిరిగి లోపలికి రానివ్వరని చెప్పారు. అయితే ప్రభుత్వాలు మరిన్ని వెనుకబడిన తరగతులను కూడా గుర్తించాలని సూచించారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వ్యక్తులు కూడా మహారాష్ట్రలో ఎక్కువగానే ఉన్నారని.. వారు రిజర్వేషన్ ప్రయోజనం ఎందుకు పొందకూడదని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. కొన్ని కుటుంబాలు, సమూహాలు మాత్రమే రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం పొందుతున్నాయని మరోసారి చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa