మూత్రవిసర్జన అనేది సహజమైన ప్రక్రియ. ఇది తరచుగా మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మన శరీరానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రక్రియ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. అయితే, మూత్ర విసర్జన సమయంలో చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు. తరచుగా మూత్ర విసర్జన చేయడం, కడుపు నొప్పి రావడం, చుక్కలు చుక్కలుగా మూత్రం రావడం, మూత్ర విసర్జన తర్వాత కూడా సంతృప్తి లేకపోవడం వంటి లక్షణాలు ఏ మాత్రం మంచివి కావు.
ఈ లక్షణాలు ఉంటే మూత్ర నిలుపుదల సమస్య(యూరిన్ రీటెన్షన్)తో బాధపడుతున్నారని అర్థం. అంటే కిడ్నీలు సరిగ్గా లేదా పూర్తిగా క్లీన్ చేయడం లేదని అర్థం. ఆసియన్ హాస్పిటల్ యూరాలజీ విభాగం డైరెక్టర్ అండ్ హెడ్ డాక్టర్ రాజీవ్ కుమార్ సేథియా ప్రకారం, ఇటీవలి కాలంలో యువతలో మూత్ర సంబంధిత సమస్యల కేసులు వేగంగా పెరిగాయి . గతంలో వృద్ధులలో కనిపించే సమస్యలు ఇప్పుడు 20 నుంచి 35 ఏళ్ల యువతలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ సమస్య ఏంటి, దీనికి కారణాలు, ఎలా నివారించవచ్చో డాక్టర్ రాజీవ్ కుమార్ చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మూత్ర నిలుపుదల అంటే ఏంటి? (యూరిన్ రీటెన్షన్)
ఈ రోజుల్లో యూరిన్ రీటెన్షన్, తరచుగా మూత్రవిసర్జన, మూత్ర విసర్జన సమయంలో మంట లేదా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు సర్వసాధారణం అవుతున్నాయి. ఒక వ్యక్తికి మూత్ర విసర్జన చేయాలనే కోరిక ఉన్నప్పటికీ మూత్రాన్ని పూర్తిగా విసర్జించలేకపోవడం, ఎక్కువసేపు మూత్రాన్ని పట్టి ఉంచలేకపోవడం ఈ పరిస్థితిని మూత్ర నిలుపుదల అంటారు. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జన, ఉబ్బరం, కడుపు నొప్పి, అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
యూరిన్ రీటెన్షన్తో కిడ్నీలకు ముప్పు
యూరిన్ రీటెన్షన్ అనేక సమస్యలు వస్తాయి. నొప్పి, అసౌకర్యం, దీర్ఘకాలికంగా మూత్రాశయం దెబ్బతినడం లేదా మూత్ర సంక్రమణ ప్రమాదం ఉంది. మూత్ర నిలుపుదల అకస్మాత్తుగా సంభవిస్తే, అది తీవ్రమైన కడుపు నొప్పి, వాపుకు కారణమవుతుంది. అంతేకాకుండా ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే తేలికపాటి నొప్పి, తరచుగా మూత్రవిసర్జన లేదా మూత్రం చుక్కలు పడటం వంటి సమస్యలు సంభవించవచ్చు.
కారణాలు
ఈ పరిస్థితికి ఒత్తిడి, మానసిక ఆందోళన ఒక ప్రధాన కారణమని డాక్టర్ చెప్పారు. ఒత్తిడి శరీరం యొక్క కండరాలు, నాడీ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఇది మూత్రాశయ పనితీరును దెబ్బతీస్తుంది. దీనితో పాటు, ఆహారంలో ఫైబర్ లేకపోవడం, తగినంత నీరు తాగకపోవడం కూడా కారణాలు అని డాక్టర్ చెబుతున్నారు. జంక్ ఫుడ్, డీహైడ్రేషన్ మలబద్ధకానికి కారణమవుతాయి. ఆ తర్వాత నిండిన పురీషనాళం మూత్ర నాళంపై ఒత్తిడి తెస్తుంది. ఇది మూత్రం నిలుపుదల సమస్యకు కారణమవుతుంది.
వర్క్ స్టైల్ కూడా ఓ కారణం
ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం లేదా ఆన్లైన్లో పని చేయడం కూడా ఈ పరిస్థితికి కారణమంటున్నారు. వర్క్ బిజీ కారణంగా చాలా మంది మూత్రాశయం నిండినప్పుడు కూడా మూత్ర విసర్జన చేయడం లేదు. దీంతో మూత్ర విసర్జన సహజ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ఇది కాకుండా, చాలా మందికి పని లేదా క్లాసుల కారణంగా మూత్రాన్ని పట్టి ఉంచే అలవాటు ఉంటుంది. ఇది మూత్రాశయ కండరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది.
ఈ సమస్యను ఎలా నివారించాలి?
ఈ సమస్యను నివారించడానికి, మీరు రోజంతా తగినంత నీరు తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. రోజుకు కనీసం 2.5 లీటర్లు నీరు తాగాలి. దీనితో పాటు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మూత్రం వచ్చినా ఎక్కువ సేపు అలాగే ఉండే అలవాటుకు చెక్ పెట్టాలి. ఎక్కువసేపు బిగుతుగా ఉండే లోదుస్తులు లేదా జీన్స్ ధరించకూడదు. పదే పదే యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. మానసిక ఒత్తిడిని నివారించాలి. ఇందుకోసం యోగా, ధ్యానం వంటివి మీ జీవనశైలిలో భాగం చేసుకోవాలి. ఈ పరిస్థితిని నివారించకపోతే కిడ్నీలపై ఒత్తిడి పెరిగి అవి ఫెయిల్ అయ్యే ప్రమాదముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa