జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోమారు తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తన పట్ల అపారమైన అభిమానం కలిగిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలుతో కలిసి ఆయన భోజనం చేసి, ఆమె ఆనందానికి కారణమయ్యారు. కాకినాడ జిల్లాకు చెందిన పేరంటాలు, పవన్ కల్యాణ్తో భోజనం చేయాలనే తన చిరకాల వాంఛను వ్యక్తం చేయగా, ఉప ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఆమెను జనసేన క్యాంపు కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, పేరంటాలు యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ఆమెతో కలిసి భోజనం చేశారు. అంతేకాకుండా, ఆ వృద్ధురాలికి లక్ష రూపాయల నగదును ఆర్థిక సహాయంగా అందించి, కొత్త చీరను కూడా బహూకరించారు. ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమ ఇంటి మనిషిలా కలిసి భోజనం చేయడం, ఆప్యాయంగా పలకరించడంతో పేరంటాలు సంతోషం వర్ణనాతీతం. ఈ అపురూప దృశ్యాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి.కాకినాడ జిల్లా, కొత్తపల్లి మండలం, కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన పోతుల పేరంటాలు, పవన్ కల్యాణ్ మరియు జనసేన పార్టీకి వీరాభిమాని. 2024 సార్వత్రిక ఎన్నికలలో పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, పేరంటాలు తమ గ్రామంలోని వేగులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, పొర్లు దండాలు సమర్పించారు. పవన్ గెలుపొందితే అమ్మవారికి వెండి గరగ చేయించి సమర్పిస్తానని కూడా మొక్కుకున్నారు.ఎన్నికలలో పవన్ కల్యాణ్ ఘనవిజయం సాధించడంతో, తన మొక్కును తీర్చేందుకు పేరంటాలు సిద్ధమయ్యారు. తనకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న పింఛను డబ్బుల నుంచి ప్రతినెలా రూ.2,500 చొప్పున దాచిపెట్టారు. అలా 2025 మే నెల నాటికి రూ.27,000 సమీకరించి, ఆ మొత్తంతో వేగులమ్మ తల్లికి వెండి గరగ చేయించి సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ క్రమంలోనే, పవన్ కల్యాణ్ను కలిసి ఆయనతో భోజనం చేయాలనే తన కోరికను స్థానిక నాయకుల వద్ద వెల్లడించారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో, ఆయన వెంటనే స్పందించి పేరంటాలును క్యాంపు కార్యాలయానికి పిలిపించి, ఆమె ఆకాంక్షను నెరవేర్చారు. ఈ ఘటన పవన్ కల్యాణ్ అభిమానుల పట్ల చూపే ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa