ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులను రెండోశ్రేణి రక్షణ కవచంగా వాడుకుంటాం..: పాక్ మంత్రి

international |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 09:44 PM

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పార్లమెంట్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. తన దేశ సైన్యం గురించి వివరించారు. మదర్సాలో చదువుతున్న విద్యార్థులను భారత్‌పై దాడి చేసేందుకు రంగంలోకి దింపుతామని వెల్లడించారు. ముఖ్యంగా వారిని తమ రెండోశ్రేణి రక్షణ కవచంగా వాడుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. అంతర్జాతీయ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. అసలు పిల్లలను ఇందులోకి లాగడం ఏంటని, వారి చేతులకు మారణాయుధాలు ఎలా ఇస్తారంటూ అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం రోజు అర్థరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. అయితే ఈ ఘటనలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు భారత సర్కారు వెల్లడించింది. కానీ పాక్ మాత్రం.. తమ పౌర నివాసాలపైనే భారత్ దాడులు చేసిందని ఆరోపించింది. ఇందుకు గట్టిగా బదులిస్తామని కూడా వెల్లడించింది. అయితే ముందు నుంచి భారత్‌పై అసత్య ప్రచారాలు చేస్తూ.. నోరు పారేసుకుంటున్న ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. తమ దేశంలో ఉగ్రవాదులే లేరని ఒకసారి, అమెరికా కోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని మరోసారి చెప్పుకొస్తున్నారు.


అలాగే ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి ముందు రోజు వరకు భారత్‌తో యుద్ధానికి సిద్ధం అని, అణుబాంబులతో దాడి చేస్తామంటూ మేకపోతు గాంభీర్యం చూపించారు. కానీ ఆపరేషన్ సిందూర్ తర్వాత శాంతి రాగం పలికారు. భారత్ ఓ అడుగు వెనక్కి వేస్తే తాము కూడా వెనక్కి తగ్గుతామని వివరించారు. ఆ తర్వాత మరోసారి ఆపరేషన్ సిందూర్‌పై స్పందిస్తూ.. భారత్ చేసిన క్షిపణి దాడుల గురించి తమకు ముందే తెలుసని.. తమ ఆచూకీ కోసమే భారత్ ఈ దాడులు చేసిందని పిచ్చి ప్రేలాపనలు చేశారు. అందుకే తాము వాటిని తిప్పికొట్టేలేమని కూడా వెల్లడించారు. ఇలా పూటకో మాట మాట్లాడుతున్న ఆయన తాజాగా తనలోని అసలు నైజాన్ని బయటపెట్టారు.


శనివారం రోజు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతూ.. మదర్సాలో చదువుతున్న విద్యార్థులను భారత్‌పై చర్యలకు రంగంలోకి దింపుతామని పేర్కొన్నారు. వారినే తమ దేశ రెండో శ్రేణి రక్షణ కవచంగా వాడుకుంటామని ప్రకటించారు. అవసరం అనుకున్న వెంటనే విద్యార్థులను తీసుకు వస్తామని.. 100 శాతం వారి సేవలను వినియోగించుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందించాయి. చిన్నారులు, విద్యార్థులను ఇలా ఇతర దేశాలపై దాడులు చేయడానికి ప్రయోగించడం సరికాదని.. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని చెప్పుకొస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa