భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరోవైపు.. ఆ దేశ జాతీయ అసెంబ్లీలో కూడా భారత్, పాక్ ఉద్రిక్తతల పట్ల రచ్చ తలెత్తింది. భారత చేపడుతున్న చర్యలపై పాక్ ప్రభుత్వంపై ఆ దేశ ఎంపీ ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శించాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పార్లమెంట్లో శుక్రవారం తీవ్రమైన వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. భారత్, పాక్ దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తోందనే దానిపై మంత్రులు తీవ్రంగా విభేదించారు.
ఈ క్రమంలోనే ఖైబర్ పఖ్తుంఖ్వా దక్షిణ ప్రాంతానికి చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, ఎంపీ షాహిద్ ఖట్టక్ నేషనల్ అసెంబ్లీలోనే ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల గురించి.. భారత్పై, భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రకటన చేయడంలో విఫలమైనందుకు షెహబాజ్ షరీఫ్ను పిరికివాడు అని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా విమర్శించిన ఎంపీ ఖట్టక్.. భారత్కు వ్యతిరేకంగా షెహబాజ్ షరీఫ్ నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదని తెలిపారు. అంతేకాకుండా సరిహద్దులో నిలబడిన పాకిస్తాన్ సైనికులు ప్రభుత్వం ధైర్యంగా పోరాడుతుందని ఆశిస్తున్నారని.. కానీ పాక్ ప్రధాని.. కనీసం మోదీ పేరును కూడా పలకలేని పిరికివాడు అయినప్పుడు.. సరిహద్దులో పోరాడుతున్న సైనికులకు ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు.
పాకిస్తాన్ పార్లమెంట్లో తాజాగా చోటుచేసుకున్న ఈ తీవ్రమైన వాగ్వాదాలు.. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. ఒకవైపు భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు పాకిస్తాన్లో రాజకీయంగా తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. అయితే సొంత ప్రధానిపైనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం పాకిస్తాన్ రాజకీయ పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. సరిహద్దుల్లోని సైనికులు ప్రభుత్వ మద్దతు కోసం ఎదురుచూస్తుండగా.. పాక్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం ఇప్పుడు వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa