పాకిస్థాన్తోపాటు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఏక కాలంలో 9 చోట్ల చేపట్టిన సైనిక దాడుల్లో.. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. బహావల్పూర్లో ఆయన కుటుంబీకులు ఈ దాడిలో చనిపోయారు. భారత్ జరిపిన దాడిలో మసూద్ అజహర్ సోదరుడు, 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన రవూఫ్ అజహర్ కూడా హతమయ్యాడు.
భారత్ దాడిలో రవూఫ్ అజహర్ అనే ఉగ్ర మూషికం చావు వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులతోపాటు అమెరికా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ కిరాతకుడిని హతమార్చిన భారత్కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఎందుకంటే అమెరికాకు చెందిన యూదు జర్నలిస్ట్ డానియల్ పెర్ల్ను రవూఫ్ దారుణంగా చంపేశాడు. 2002లో పాకిస్థాన్ తరఫున వాల్ స్ట్రీట్ జర్నల్ తరఫున జర్నలిస్టుగా పని చేస్తున్న సమయంలో.. పెర్ల్ను కిడ్నాప్ చేసి, ఎంతగానో టార్చర్ చేసిన ఉగ్రవాదులు అతణ్ని తల నరికి చంపేశారు.
డానియల్ పెర్ల్ చనిపోయన 23 సంవత్సరాల తర్వాత అతడి మరణానికి కారణమైన రవూఫ్ అజహర్ను ఇండియన్ ఆర్మీ హతమార్చిందని తెలిసి.. అతడి కుటుంబీకులతోపాటు అమెరికా జర్నలిస్టులు, యూదులు సంతోషం వ్యక్తం చేశారు. రవూఫ్ మరణం పట్ల అమీ మెక్ అనే అమెరికన్ జర్నలిస్ట్ స్పందిస్తూ.. ‘‘దారుణ హత్యకు గురైన అమెరికన్ యూదు జర్నలిస్ట్ డానియెల్ పెర్ల్కు భారత్ న్యాయం చేసింది. పాక్ ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నప్పటికీ.. ఎందరో అమాయకులు దానికి మూల్యం చెల్లిస్తున్నప్పటికీ.. పశ్చిమ దేశాలు సహించాయి. జిహాద్కు కారణమైన ఇస్లామిక్ ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేయడం ద్వారా.. ఏది అవసరమో చివరకు భారత్ అది చేయగలిగింది’’ అని ఎక్స్లో పోస్టు చేశారు.
‘అబ్దుల్ రవూఫ్ అనే వాడు కేవలం ఉగ్రవాది మాత్రమే కాదు.. జైషే మహ్మద్ ఫౌండర్ మసూద్ అజహర్ తమ్ముడు, అత్యంత క్రూరమైన ఇస్లామిక్ దాడుల వెనుక మాస్టర్ మైండ్ అతడు. డానియెల్ పెర్ల్ హత్యకు అతడే కుట్ర పన్నాడు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదం గుండెల మీద దెబ్బకొట్టింది, జైషే మహ్మద్ బలమైన ప్రదేశాలను నాశనం చేయడం ద్వారా స్పష్టమైన సందేశం పంపించింది. ఉగ్రవాదులు ముస్లిమేతరులను వధించడాన్ని సహించబోమని భారత్ గట్టిగా చెప్పింది’ అని సదరు జర్నలిస్ట్ ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రశంసలు గుప్పించారు.
‘భారత్కు మేము ధన్యవాదాలు చెబుతున్నాం. ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలంగా నిలబడినందుకు.. జిహాదీలతో నేరుగా తలపడుతున్నందుకు ధన్యవాదాలు. ఇస్లామిక్ ఉగ్రవాదం పట్ల ఎలా వ్యవహరించాలో భారత్ను చూసి పశ్చిమ దేశాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. నాగరిక ప్రపంచంలో ఇస్లామిక్ జిహాద్కు చోటు లేదు, ఇలాంటి రాక్షసులకు ఆశ్రయం ఇస్తున్న వారెవరైనా పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని జర్నలిస్ట్ అమీ మెక్ పోస్టు చేశారు.
ఇక అబ్దుల్ రవూఫ్ అజహర్ చేసిన దుర్మార్గాల విషయానికి వస్తే.. 1999 డిసెంబర్లో ఇండియన్ ఖాట్మండూ నుంచి ఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన అనంతరం అప్ఘానిస్థాన్కు మళ్లించి.. తన సోదరుడైన మసూద్ అజహర్తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను విడిపించుకున్నాడు.
2000 సంవత్సరంలో జైషే మహ్మద్ ఏర్పాటయ్యాక.. అజహర్ సోదరులిద్దరూ భారత్లో అనేక ఉగ్రదాడులకు కారణమయ్యారు. 2001లో పార్లమెంట్పై జరిగిన దాడి, 2008లో ముంబై ఉగ్రదాడులు, 2016లో పఠాన్కోట్ దాడి, 2019లో పుల్వామా దాడికి వీరే ప్రధాన కారణం. 2007లో మసూద్ అజహర్ అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయాక.. రవూఫ్ అజహర్ జైషే మహ్మద్ డిఫ్యాక్టో లీడర్ అయ్యాడు. 2010 డిసెంబర్లో అమెరికా అబ్దుల్ రవూఫ్ను ఉగ్రవాదిగా గుర్తించింది.
![]() |
![]() |