ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్‌లో..ఐసీ-814 హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజార్ హతం..!

international |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 09:54 PM

పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు కొనసాగిస్తోంది. ఓవైపు దౌత్యపరంగా దాయాది దేశానికి చుక్కలు చూపిస్తూనే.. మరోవైపు మంగళవారం రోజు అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలే లక్ష్యంగా చేసుకుని చేసిన క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ మృతుల్లోనే 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఐసీ-814 హైజాక్ మాస్టర్ మైండ్, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తింపు పొందిన జైషే నాయకుడు మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ హతమైనట్లు తెలుస్తోంది.


భారత్ మంగళవారం రోజు అర్ధరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దాడుల్లో బహవల్‌పుర్‌లోని జైషే ప్రధాన కార్యాలయం, మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్ పూర్తిగా ధ్వంసం అయింది. మొత్తం 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భవంతిని ఉస్మాన్-ఓ-అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తుండగా.. నిధుల సేకరణ, బోధన కేంద్రంగా దీన్ని వినియోగిస్తున్నారు. అలాగే ఈ మసీదును జైషే నాయకుడు మసూద్ అజార్ ఇంటిగా వాడుతుండగా.. ఆయన కుటుంబ సభ్యులు అంతా ఇందులోనే ఉండగా భారత్ దాడి చేసింది. ఫలితంగా ఈ భవనం అంతా కుప్పకూలి.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.


ముఖ్యంగా మసూద్ అజార్ కుటుంబానికి చెందిన దాదాపు 10 మంది హతం అయ్యారు. అలాగే నలుగురు సన్నిహితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని మసూద్ అజార్ కూడా ధ్రువీకరించగా.. వీరిలోనే ఆయన సోదరుడు, 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఐసీ-814 హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజార్ హతమైనట్లు తెలుస్తోంది. అయితే ఇతడు అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ముఖ్యంగా పఠాన్‌కోట్ దాడి సహా 2001లో జరిగిన పార్లమెంట్ దాడిలోనూ ఇతడు పాల్గొన్నాడు. అలాగే వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ హత్య వెనుక కూడా ఇతడి హస్తం ఉంది.


ఇదంతా ఇలా ఉండగా.. 1999లో జరిగిన ఐసీ-814 విమానం హైజాక్‌లో ఇతడి ప్రమేయం మరింత ఎక్కువగా ఉంది. మొత్తంగా ఐదుగురు పాక్ ఉగ్రవాదులు నేపాల్‌లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు తరలించారు. అక్కడి నుంచి భారత సర్కారుతో చర్చలు జరిపి.. ఇండియా జైల్లో ఉన్న మసూద్ అజార్, అహ్మద్ ఒమర్ సయూద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదులను విడిపించుకుని తీసుకెళ్లారు. ఆ తర్వాతే మసూద్ అజార్ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించి.. మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్ వేదికగా పార్లమెంట్, పఠాన్‌కోట్, పుల్వామా దాడులకు పథక రచన చేశారు. ఇందులో రవూఫ్ కూడా పాలు పంచుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com