భారతదేశంలో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మార్చి 1వ తేదీ నుండి వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్లకు ‘సిమ్ బైండింగ్’ నిబంధనను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన ప్రకారం, మీ స్మార్ట్ఫోన్లో ఫిజికల్ సిమ్ కార్డ్ ఉంటేనే ఆయా యాప్లు పనిచేస్తాయి. ఈ గడువును పొడిగించాలని టెక్ సంస్థలు కోరినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అందుకు నిరాకరించడం గమనార్హం.
ఈ కొత్త నిబంధన ప్రధానంగా సైబర్ నేరాలు మరియు నకిలీ అకౌంట్ల అదుపునకు ఉద్దేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాలామంది తమ మొబైల్ నంబర్తో రిజిస్టర్ అయి, ఆ తర్వాత సిమ్ కార్డ్ లేకుండానే వైఫై ద్వారా మెసేజింగ్ యాప్లను వాడుతున్నారు. అయితే ఇకపై అటువంటి వెసులుబాటు ఉండదు. మీ ఫోన్లో యాక్టివ్ సిమ్ కార్డ్ ఉంటేనే సందేశాలు పంపడం లేదా స్వీకరించడం సాధ్యమవుతుంది, ఇది వినియోగదారుల భద్రతను పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు, కంప్యూటర్లు లేదా వెబ్ వెర్షన్లలో మెసేజింగ్ యాప్లను వాడే వారికి కూడా నిబంధనలు కఠినతరం అయ్యాయి. వెబ్లో లాగిన్ అయిన వారు ప్రతి 6 గంటలకు ఒకసారి తప్పనిసరిగా రీ-అథెంటికేషన్ (Re-authentication) చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ధ్రువీకరణ పూర్తి చేయకపోతే, ఖాతా ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అయిపోతుంది. దీనివల్ల ఆఫీసుల్లో లేదా ఇతరుల సిస్టమ్స్లో పొరపాటున లాగిన్ వదిలేసినా డేటా చోరీకి గురికాకుండా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ మార్పుల వల్ల సాధారణ వినియోగదారులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ, భద్రతా పరంగా ఇవి అత్యవసరమని కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఓటీపీ మోసాలు, అపరిచితుల నుంచి వచ్చే నకిలీ సందేశాలకు ఈ విధానం చెక్ పెడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 1 గడువు సమీపిస్తున్న తరుణంలో, యూజర్లు తమ ఫోన్లలో సిమ్ కార్డ్ స్టేటస్ను సరిచూసుకోవడం మంచిది. లేదంటే మెసేజింగ్ సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa