ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశం తర్వాతే క్రికెట్.. తేల్చిచెప్పిన బీసీసీఐ!

sports |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 11:57 PM

భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకోవడంతో ఐపీఎల్ 2025ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దేశం తర్వాతే తమకు ఏదైనా అని ఈ సందర్భంగా బీసీసీఐ తేల్చి చెప్పింది. ప్రభుత్వం, భారత ఆర్మీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని బీసీసీఐ వెల్లడించింది.


ఐపీఎల్ 2025ను వారం రోజుల పాటు అర్ధంతరంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన మిగతా అప్‌డేట్స్‌ను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. ఐపీఎల్ 2025 న్యూ షెడ్యూల్, వేదికలపై పరిస్థితుల ఆధారంగా సమాచారం అందిస్తామని తెలిపింది.


"ఐపీఎల్ భాగస్వామ్యులు, ఫ్రాంఛైజీలతో చర్చించిన తర్వాతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సెల్ ఈ నిర్ణయం తీసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో బీసీసీఐ దేశం కోసం కచ్చితంగా నిలబడుతుంది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైనికుల ధైర్యానికి, సేవకి బీసీసీఐ సెల్యూట్ చేస్తోంది. క్రికెట్‌ని దేశం మొత్తం ఆదరిస్తున్నప్పటికీ.. దేశం తర్వాతే మాకు ఏదైనా. దేశ భద్రతే మాకు చాలా ముఖ్యం. దేశానికి ఏది కావాలో అది చేయడానికి మేము ముందుంటాం" అని బీసీసీఐ ప్రెస్‌నోట్‌లో పేర్కొంది.


మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ 2025 మే 25 వరకు కొనసాగాల్సి ఉంది. కానీ భారత్-పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా ప్లే ఆఫ్స్‌కు ముందే ఈ సీజన్ వాయిదా పడింది. వారం రోజులు అని బీసీసీఐ చెబుతున్నప్పటికీ.. అప్పటి పరిస్థితులను బట్టి ఐపీఎల్ నిర్వహించే దానిపై స్పష్టత వస్తుంది. యుద్ధ మేఘాలు ఇలానే ఉంటే ఐపీఎల్ 2025 మరింత వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రికెట్ విశ్లేషకుల ప్రకారం ఇంగ్లండ్-ఇండియా టెస్టు సిరీస్ తర్వాత తిరిగి ఐపీఎల్ 2025 కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక ప్రకారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ సీజన్ నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయ్యాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరుగులేని ప్రదర్శనతో రెండో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ మూడు, ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ, కోల్‌కతా, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com