ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియన్ ఆర్మీకి సెల్యూట్,,,జై హింద్ నినాదాలతో హోరెత్తించిన క్రికెటర్లు

sports |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 12:01 AM

భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ టీమిండియా క్రికెటర్లు తమ దేశభక్తి ప్రదర్శించారు. ఐపీఎల్ 2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో దేశానికి అండగా నిలబడాలని టీమిండియా క్రికెటర్లు ట్వీట్లతో హోరెత్తించారు. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.


పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాక్తిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎయిర్ స్ట్రయిక్స్ చేసిన ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. టెర్రరిస్టులే లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేయగా.. పాకిస్తాన్ ప్రతిదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి డ్రోన్లతో పాక్ దాడులకు తెగబడింది. పాక్ కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ విధించింది. ఈ క్రమంలోనే ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేశారు.


పాకిస్తాన్ దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతగా తిప్పికొట్టడంతో టీమిండియా క్రికెటర్లు జై హింద్ నినాదాలతో హోరెత్తించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, కృనాల్ పాండ్యా సోషల్ మీడియాలో ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ పోస్టులు చేశారు. తమను కంటికి రెప్పలా కాపాడుతున్న బోర్డర్‌లోని సైనికులకు రోహిత్ శర్మ భార్య రితిక, విరాట్ కోహ్లి వైఫ్ అనుష్క శర్మ థాంక్స్ చెబుతూ పోస్టులు చేశారు.


"భారత త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ తీసుకునే ఏ నిర్ణయానికైనా నేను కట్టుబడి ఉంటాను. మన దేశం కోసం మన ఆర్మీ పోరాటం చేస్తోంది. ఈ సమయంలో ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండాలి. ఈ సమయంలో ఎన్నో ఫేక్ న్యూస్‌లు వెలువడే అవకాశం ఉంది.. అలాంటి వాటిని నమ్మొద్దు" అని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.


"మేమంతా మీవైపే ఉన్నాము. క్లిష్ట సమయాల్లో దేశాన్ని కాపాడుతున్న ఇండియన్ ఆర్మీకి సెల్యూట్. దేశం కోసం పోరాడుతున్న నిజమైన హీరోలకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. జై హింద్" అని కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. మన ఇండియన్ ఆర్మీని చూసి గుండె ఉప్పొంగుతుంది అంటూ కృనాల్ పాండ్యా పోస్ట్‌లో పేర్కొన్నాడు.


"ఇవి నా గుండె లోతుల్లో నుంచి వస్తున్న మాటలు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్నా ప్రతి ఒక్కళ్లు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీరు లేకపోతే ఇవాల్టి రోజున మేము లేము. మా అందర్నీ కాపాడుతున్నందుకు థాంక్స్" అని రోహిత్ భార్య రతితికా సజ్దేహ్ పోస్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీని ఆకాశానికి ఎత్తుతూ అనుష్క శర్మ పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్ కింద కోహ్లి జై హింద్ అని కామెంట్ చేశాడు.


భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు ఉదయం బీసీసీఐ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఐపీఎల్ 2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. జూన్‌లో ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుండటంతో ఆ సిరీస్ తర్వాతే తిరిగి ఐపీఎల్ 2025 మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com