ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్బీఐ కీలక నిర్ణయం.. ఆ బ్యాంకులో వాటా విక్రయం

business |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 12:02 AM

భారతీయ బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశీయ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. ప్రైవేట్ రంగ బ్యాంకు యెస్ బ్యాంక్‌లో తనకున్న భారీ వాటాను విక్రయించడానికి సిద్ధమైంది. జపాన్‌కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ .. యెస్ బ్యాంకులో 13.19 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ అక్షరాలా రూ. 8,889 కోట్లు. శుక్రవారం జరిగిన సమావేశంలో, SBI అత్యున్నత కమిటీ 413 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించడానికి ఆమోదం తెలిపింది. ఒక్కో షేరును రూ. 21.50 ధరకు విక్రయించనున్నారు. అయితే, ఈ అమ్మకం SMBC నియంత్రణ సంస్థలు, అధికారుల నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత మాత్రమే పూర్తవుతుందని ఎస్బీఐ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  అభ్యర్థన మేరకు మార్చి 2020లో.. యెస్ బ్యాంక్‌ను సంక్షోభం నుంచి కాపాడిన ఎస్బీఐ.. ఒక్కో షేరును రూ. 10 ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు రూ. 21.50 ధరకు విక్రయించడం ద్వారా ఎస్బీఐ భారీ లాభాలను ఆర్జించనుంది.


 జపాన్‌లోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్ఎం‌బీసీ.. సుమారు 1.7 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది ఇంకా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 15 దేశాలతో సహా 39 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కొనుగోలు యెస్ బ్యాంక్‌కు కొత్త దీర్ఘకాలిక పెట్టుబడిదారుడిని తీసుకురావడానికి సిటీతో కలిసి ఎస్బీఐ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ఐసీ వంటి అనేక దేశీయ సంస్థలు యెస్ బ్యాంక్‌లో మొత్తం 11.34 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అవి కూడా తమ వాటాను తగ్గించుకునే అవకాశం ఉంది.


భారతీయ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకే విదేశీ సంస్థ 15 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండటానికి, 26 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ హక్కులను కలిగి ఉండటానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) నియమాలు పరిమితి విధిస్తాయి. అయితే, ఆర్బీఐ గతంలో కొన్ని అరుదైన సందర్భాల్లో ఈ నియమాలకు మినహాయింపులు ఇచ్చింది. ముఖ్యంగా 2018లో కాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో ఫెయిర్‌ఫాక్స్‌కు 51 శాతం వాటాను, 2020లో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను.. డీబీఎస్ కోసం అనుమతించింది. ఈ నేపథ్యంలో ఎస్ఎంబీసీ డీల్‌కు ఆర్బీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.


ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయం..


ఇదిలా ఉండగా, ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయం ఈ ఏడాది డిసెంబరులోగా పూర్తవుతుందని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. ఈ బ్యాంకులో కేంద్రప్రభుత్వం 30.48 శాతం, ఎల్‌ఐసీ 30.24 శాతం వాటాను విక్రయించాలని ఇదివరకే నిర్ణయించాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com