భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మరో 4- 5 రోజుల్లో టోర్నీని పునఃప్రారంభించాలని ఐపీఎల్ నిర్వహకులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ.. స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చాలని స్పష్టం చేసింది. దీంతో ఫ్రాంఛైజీలు.. తమ ఆటగాళ్లతో మళ్లీ శిబిరం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాయి.
మిగతా ఫ్రాంఛైజీల సంగతి ఎలా ఉన్నా.. గుజరాత్ టైటాన్స్ మాత్రం ఈ విషయంలో అందరికంటే ముందు ఉంది. ఆ జట్టు ఇప్పటికే గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో ట్రైనింగ్ రీస్టార్ట్ చేసింది. కాల్పులు విరమణ ప్రకటన వచ్చిన మరుసటి రోజే ఆ జట్టు ట్రైనింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే లీగ్ వాయిదా పడటంతో చాలా మంది ప్లేయర్లు జట్టును వీడి.. వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. విదేశీ ప్లేయర్లు వారి దేశాలకు.. స్వదేశీ ఆటగాళ్లు వారి ఇళ్లకు చేరిపోయారు. కానీ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు మాత్రం ట్రైనింగ్ను పునఃప్రారంభించేశారు.
అయితే గుజరాత్ టైటాన్స్ జట్టు ఆటగాళ్లయిన జోస్ బట్లర్, గెరాల్డ్ కొయెట్జీ ఇప్పటికే భారత్ విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. లీగ్ ప్రారంభమయ్యే సమయానికి వారిద్దరూ తిరిగి జట్టుతో చేరతారని సమాచారం. మే 16న లేదా 17న లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్తో ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఇక పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్లు.. సాయి సుదర్శన్ (509 పరుగులు), శుభ్మన్ గిల్ (508 పరుగులు), జోస్ బట్లర్ (500 పరుగులు) మంచి ఫామ్లో ఉన్నారు. పర్పుల్ క్యాప్ రేసులో ప్రసిద్ధ్ కృష్ణ (20 వికెట్లు) ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. ఇక ఐపీఎల్ 2024లో గిల్ తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కానీ అప్పుడు గుజరాత్ ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. కానీ ఈసారి అదిరే ప్రదర్శనతో టాప్-2లో కొనసాగుతోంది. తన సారథ్యంలో టైటిల్ సాధించి.. భారత జట్టు ఫ్యూచర్ కెప్టెన్ అవ్వాలని గిల్ భావిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa