ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెస్ట్ క్రికెట్‌కు కోహ్లి గుడ్ బై.. బీసీసీఐ కోరినా వెనక్కి తగ్గని విరాట్

business |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 10:48 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి టెస్టులకు గుడ్ బై ప్రకటించాడు. లాంగ్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సోమవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇటీవలే రోహిత్ శర్మ సైతం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంటనే కోహ్లి కూడా టెస్టులకు రిటైరవుతాడనే వార్తలొచ్చాయి. ఇంతకు ముందే రోహిత్, కోహ్లి ద్వయం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఇక నుంచి వీరిద్దరూ వన్డేలకు మాత్రమే పరిమితం కానున్నారు.


“టెస్ట్ క్రికెట్‌లో నేను మొదటిసారి భారత జట్టు క్యాప్‌ ధరించి 14 సంవత్సరాలు అయింది. నేను ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నా. ఇది అంత ఈజీ కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైనది అని నాకు అనిపిస్తోంది. ఈ ఫార్మాట్‌ కోసం నేను ఏం చేయగలనో.. నా వల్ల ఎంత అవుతుందో అంతా చేశాను. ఇదే సమయంలో నేను ఊహించనిదానికంటే ఎక్కువే నాకు ఈ ఫార్మాట్ ఇచ్చింది. నా టెస్టు కెరీర్‌ను ఎప్పుడు తిరిగి చూసుకున్నా అది సంతోషాన్ని ఇస్తుంది” అని విరాట్ కోహ్లీ పోస్టు పెట్టాడు.


విరాట్ కోహ్లీ 2011లో భారత జట్టు తరఫున సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టాడు. తన కెరీర్‌లో 123 టెస్టు మ్యాచులు ఆడిన కోహ్లీ.. 9230 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ సిరీస్‌లో విరాట్ కోహ్లి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు నెల రోజుల ముందు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.


ఇటీవల రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి కోహ్లీ సైతం రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది. దీనిపై చాలా మంది మాజీ క్రికెటర్లు కోహ్లీ నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. టెస్టు క్రికెట్‌కు అతడి అవసరం ఉందని.. దయచేసి నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా సైతం ఇదే రిక్వెస్ట్ చేశాడు. అంబటి రాయుడు, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, మైకెల్‌ వాన్ ఇలా ఎంతో మంది ప్రముఖులు కోహ్లీ మరింత కాలం టెస్టు క్రికెట్‌లో కొనసాగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఓ దశలో బీసీసీఐ కూడా కోహ్లీని ఒప్పించాలని ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. రోహిత్, కోహ్లి ఇద్దరూ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటిస్తే.. దాని ప్రభావం జట్టుపై ఉంటుందని.. అందుకే మరి కొంత కాలం లాంగ్ ఫార్మాట్లో ఆడాలని బీసీసీఐ విరాట్‌కు సూచించినట్లు సమాచారం. కానీ విరాట్ కోహ్లీ మాత్రం తన నిర్ణయం తీసుకున్నాడు. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాక, కోహ్లి కెప్టెన్సీ ఆశించాడని.. కానీ కెప్టెన్ విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో ఉన్న బీసీసీఐ అందుకు ఒప్పుకోలేదని కూడా ప్రచారం జరిగింది. రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.


గూగుల్ ట్రెండ్స్‌లో విరాట్ కోహ్లీ


టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నిమిషాల తర్వాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. వారిద్దరూ లండన్ బయల్దేరి వెళ్తున్నట్లు తెలుస్తోంది. టెస్టు ఫార్మాట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి గురించి అభిమానులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. దీంతో విరాట్ కోహ్లీ (Virat Kohli) గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచాడు.


కర్ణాటక, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో విరాట్ కోహ్లీ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ప్రధానంగా కోహ్లీ క్రికెట్ కెరీర్ గణాంకాలు, అతడి సెంచరీల సంఖ్య గురించి సెర్చ్ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa