టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడంపై భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్, 1983 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు సయ్యద్ కిర్మాణి స్పందించారు. కోహ్లీ ఇంకా కొన్నేళ్లపాటు టెస్ట్ క్రికెట్ ఆడగల సత్తా ఉన్న ఆటగాడని, అతనిలో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని అభిప్రాయపడ్డారు.సోమవారం నాడు టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. తన కెరీర్లో 123 టెస్టులు ఆడిన కోహ్లీ, 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. అందులో 30 శతకాలు ఉన్నాయి. కోహ్లీ ఆకస్మిక నిర్ణయంపై సయ్యద్ కిర్మాణి తన అభిప్రాయాలను పంచుకున్నారు."విరాట్ కోహ్లీ ఆటలో కనబరిచిన నిలకడే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. యువ క్రీడాకారులకు అతను ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. నా అంచనా ప్రకారం, వ్యక్తిగత రికార్డుల గురించి అతను పెద్దగా పట్టించుకోడు. అలాగే, వీడ్కోలు నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురై ఉండడని భావిస్తున్నాను. రిటైర్మెంట్ అనేది పూర్తిగా అతని వ్యక్తిగత విషయం" అని కిర్మాణి పేర్కొన్నారు."ప్రతి క్రీడాకారుడు ఏదో ఒక రోజు రిటైర్ అవ్వాల్సిందే. కానీ విరాట్ కోహ్లీ ఇంకొంతకాలం టెస్టుల్లో కొనసాగి ఉంటే బాగుండేది. అతనిలో ఇంకా చాలా టెస్ట్ క్రికెట్ దాగి ఉంది. ఏదేమైనప్పటికీ, అతని నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. అతని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను" అని సయ్యద్ కిర్మాణి తెలిపారు. క్రికెటర్లు తమ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa