ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ,,,,,వల్లభనేని వంశీకి బెయిల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 07:30 PM

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు భారీ ఊరట లభించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. ఈ కేసులో వల్లభనేని వంశీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వల్లభనేని వంశీతో పాటుగా మరో నలుగురికి కోర్టు బెయిల్ ఇచ్చింది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో రిమాండ్ ముగియటంతో మంగళవారం ఉదయం పోలిసులు వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరచగా.. కోర్టు మే 14 వరకూ అంటే మరో రోజు రిమాండ్ పొడిగించింది. తాజాగా వల్లభనేని వంశీకి బెయిల్ ఇస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు నిర్ణయం తీసుకుంది.


మరోవైపు 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. ఆ సమయంలో గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ ఉన్నారు. వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ శ్రేణులు కలిసి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారంటూ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్‌ను వల్లభనేని వంశీ, అతని అనుచరులు కిడ్నాప్ చేసి.. తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చేలా బెదిరించారంటూ వల్లభనేని వంశీమోహన్‌పై ఆరోపణలు వచ్చాయి.


దీంతో సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలపై 2025 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో ఉన్న వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడకు తరలించి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో వల్లభనేని వంశీ ఫిబ్రవరి నుంచి అంటే దాదాపు మూడు నెలలుగా విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రిమాండ్ ముగియటంతో మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.


ఈ సమయంలో తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని వల్లభనేని వంశీ కోర్టు దృష్టికి తెచ్చినట్లు సమాచారం. మాట్లాడేందుకు ఇబ్బందిగా ఉందని.. ఊపిరి తీసుకోలేకపోతున్నట్లు కోర్టుకు తెలియజేశారని తెలిసింది. దీంతో న్యాయస్థానం వల్లభనేని వంశీని ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం ఒకరోజు రిమాండ్ పొడిగించింది. తాజాగా వల్లభనేని వంశీ వేసిన బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిపిన కోర్టు.. వంశీతో పాటుగా మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa