కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. వాటికి దూరంగా మాత్రం ఉండలేకపోతున్నారు. కల్తీ మద్యంతో ఎంతోమంది ప్రాణాలు పోయినా.. దాన్ని మాత్రం వదలడం లేదు. తక్కువ ధరకు రావడం, మద్యం దొరకని ప్రాంతాల్లో దొరకడంతో.. మద్యం ప్రియులు ఈ కల్తీ మద్యాన్ని తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరు కల్తీ మద్యం అమ్మకం దారులు.. అధిక సంపాదన కోసం మద్యాన్ని కల్తీ చేసి విక్రయించి.. అనేక మంది చనిపోవడానికి కారణం అవుతున్నారు. పంజాబ్లోని అమృత్సర్లో కల్తీ మద్యం తాగి 15 మంది మృతి చెందిన విషాధ సంఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అమృత్సర్లోని మజితాకు చెందిన ప్రధాన నిందితుడు ప్రభ్జిత్ సింగ్.. ఆన్లైన్లో ఇథనాల్ కొనుగోలు చేసినట్లు మజితా ఎస్ఎస్పీ మణిందర్ సింగ్ తాజాగా ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. ఈ కల్తీ మద్యం తాగిన కేసులో ఇప్పటివరకు 15 మంది మృతిచెందినట్లు ప్రకటించారు. కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్న ప్రభ్జిత్ సింగ్ను పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రభ్జిత్ సింగ్.. ఆన్లైన్లో సుమారు 50 లీటర్ల ఇథనాల్ కొన్నాడని.. ఆ తర్వాత దానికి మరో 70 లీటర్ల నీళ్లను కలిపినట్లు తెలిపారు. మొత్తంగా 120 లీటర్ల కల్తీ మద్యంగా తయారు చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు.
ఈ కేసులో ప్రభ్జిత్ సింగ్తోపాటు కుల్బీర్ సింగ్, సాహబ్ సింగ్, గుర్జాంత్ సింగ్, నిందర్ కౌర్లను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సాహెబ్ సింగ్ అనే వ్యక్తి ఇథనాల్ను ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు ఎస్ఎస్పీ మణిందర్ సింగ్ వెల్లడించారు. ఆ తర్వాత ఆ ఇథనాల్ను బస్సులు, కొరియర్ సర్వీసుల ద్వారా వివిధ ప్రాంతాలకు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆన్లైన్లో ఇథనాల్ విక్రయిస్తున్న కంపెనీలను తాము గుర్తించినట్లు పోలీసులు వివరించారు. అలాంటి కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఇక అమృత్సర్ చుట్టు పక్కల గ్రామాల్లో ఈ కల్తీ మద్యం సేవించిన బాధితులకు పంజాబ్ ప్రభుత్వం ప్రస్తుతం చికిత్స అందిస్తోంది. కల్తీ సారా తాగి విష లక్షణాలతో బాధపడుతున్న వారిని స్థానిక ఆరోగ్య అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు.. కల్తీ మద్యం తాగి చనిపోయిన బాధితుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని శిరోమణి అకాలీ దళ్ నేత బిక్రమ్ సింగ్ మజీత.. పంజాబ్ సర్కార్ను డిమాండ్ చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa