ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలోని వలసదారులకు బంపరాఫర్.. ఆ పనిచేస్తే పౌరసత్వం ఇస్తారట

international |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 08:45 PM

అమెరికాలో వలసదారులకు పౌరసత్వం ఇచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్.. ఒక వినూత్నమైన రియాలిటీ షోను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజాగా వెల్లడించింది. అయితే ఇప్పటికి ఇది పరిశీలన దశలోనే ఉన్నట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఆ దేశంలోని వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గోల్డ్ కార్డ్ వీసాను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుట్టుకతో వచ్చే అమెరికా పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేయడం అక్కడి వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుండగా.. ఈ నిర్ణయం కాస్త ఊరట కలిగించనుంది.


వలసదారులకు పౌరసత్వం పొందేందుకు ఒక ప్రత్యేక మార్గాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పరిశీలన దశలో ఉన్న ఈ ప్రతిపాదన ఇంకా ఆమోదం పొందడం గానీ.. కొట్టివేయడం గానీ జరగలేదని.. అమెరికా ప్రజా వ్యవహారాల విభాగం తెలిపింది. అయితే ఇప్పటివరకు ఉన్న విధానాలను దాటి కొత్తగా ఆలోచించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఒక రియాలిటీ షోను ఏర్పాటు చేయనుంది. అందులో విజేతలుగా నిలిచిన వారికి అమెరికా పౌరసత్వం దక్కనుంది. ఈ రియాలిటీ షోకు హాజరైన వారు.. పలు టాస్క్‌ల్లో తమకు అమెరికాపై ఎంత దేశభక్తి ఉంది అనేది నిరూపించుకోవాల్సి ఉంటుందని సమాచారం.


గోల్డ్ రష్, కార్ అసెంబ్లీ వంటి టాస్క్‌లు ఈ రియాలిటీ షోలో ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఇది వలసదారుల కోసం నిర్వహించే హంగర్ గేమ్ కాదని అధికారులు స్పష్టం చేశారు. ఎల్లిస్ ఐలాండ్‌లో ప్రారంభం కానున్న ఈ రియాలిటీ షోలో ప్రతీ ఎపిసోడ్‌కు ఒకరిని ఎలిమినేట్ చేయనున్నారు. చివరికి విజయం సాధించిన వారికి అమెరికా పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది. ట్రంప్ సర్కార్ వివిధ వర్గాల వలసదారులకు తాత్కాలిక రక్షణ హోదాను రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ రియాలిటీ షో ఏర్పాటు చేయనున్నట్లు వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అసాధారణ పరిస్థితుల వల్ల స్వదేశానికి సురక్షితంగా తిరిగి వెళ్లలేని విదేశీ పౌరుల కోసం తాత్కాలిక రక్షణ హోదాను ఇస్తారు.


అయితే అమెరికా పౌరసత్వం కోసం జరిగే ఈ రియాలిటీ షో.. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన స్క్విడ్ గేమ్ సిరీస్‌ను గుర్తుకు తెస్తోంది. జీవితంలో అన్నీ కోల్పోయి అప్పులపాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్లి.. అక్కడ రెడ్‌లైట్ గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు నిర్వహిస్తారు. ఇలాంటి 6 పోటీల తర్వాత విజేతకు భారీ మొత్తంలో బహుమతిని అందిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa