ఇజ్రాయెల్-హమాస్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని.. బందీలను విడుదల చేసుకున్నప్పటికీ తాజాగా మళ్లీ దాడులు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ పెట్టిన షరతులు ఒప్పుకోని విధంగా ఉండగా.. హమాస్ కాల్పుల విరమణకు ఒప్పుకోలేదు. దీంతో ఇజ్రాయెల్ దాడులను మరింత ఎక్కువ చేసింది. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న నివాసాలు, శిబిరాలే లక్ష్యంగా చేసుకుని వైమానికి దాడులకు పాల్పడింది. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 103 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని నేరుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖనే ప్రకటించింది.
గతంలో ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. ముఖ్యంగా ఇద్దరూ విడతల వారీగా తమ బందీలను విడుదల చేసుకున్నారు. అయితే హమాస్ లెక్క ప్రకారం బందీలను విడుదల చేయకపోవడంతో ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది. అనేక మార్లు అనేక మందిని చంపగా.. హమాస్ కాల్పుల విరమణ గురించి మరోసారి ఇజ్రాయెల్తో చర్చించింది. కానీ ఒప్పుకోని విధంగా షరతులు పెట్టడంతో హమాస్ అందుకు అంగీకరించ లేదు. దీంతో హమాస్ను ఎలాగైనా సరే కాల్పుల విరమణకు ఒప్పించాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. నేరుగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుయే దీని గురించి మాట్లాడుతూ.. హమాస్ కాల్పుల విరమణకు ఒప్పుకోకపోవడం వల్లే దాడులను తీవ్రతరం చేసినట్లు వివరించారు.
అలాగే తమ బందీలను విడుదల చేయడానికి హమాస్ పదే పదే నిరాకరిస్తోందని చెప్పుకొచ్చారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును హమాస్ తిరస్కరించిందని.. ఈ నేపథ్యంలోనే దాడులకు ఆదేశించామన్నారు. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేస్తోందన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం రోజు అర్ధరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో ఖాన్యూనిస్లో 29 మంది, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మొత్తంగా ఇలా ఇజ్రాయెల్ చేసిన దాడులు 103 మంది చనిపోగా.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే అందులో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు స్పష్టం చేసింది. పదుల సంఖ్యలో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే తాజా దాడులపై ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కనీ శనివారం ఒక్కరోజే 150 మంది చనిపోయారని, 450 మందికి పైగా గాయాల పాలయ్యారని వెల్లడించింది. మార్చి 18వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైనప్పటి నుంచి 3 వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయనట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa